Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్సీ ప్రకారం జీతాలివ్వక వెతలు
- ఉద్యోగ అభద్రతలో బోధనేతర సిబ్బంది
- చట్టాలు పాటించని ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలు
- సాంకేతిక విద్యాశాఖ, వర్సిటీల పర్యవేక్షణ కరువు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సమస్యలతో సతమతమవుతున్నారు. నిబంధనల ప్రకారం బోధనా సిబ్బందికి యూజీసీ వేతనాలు, బోధనేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీ ప్రకారం వేతనాలు అమలు చేయాలి. కానీ ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఆ నిబంధనలను పాటించడం లేదు. ముఖ్యంగా బోధనేతర సిబ్బందికి పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదు. నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నామని చెప్పి ఫీజులు భారీగా పెంచుకుంటున్న టాప్ కాలేజీల్లోనూ ఈ తేడా ఉంది. ఇంకోవైపు కొత్తగా చేరిన బోధనేతర సిబ్బందికి కనీస వేతనాల ప్రకారం రూ.12,500 చెల్లించాలి. అదీ వర్తింపచేయడం లేదు. కాలేజీని బట్టి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నాయి. కనీస వేతనాలు అందక బానిసలుగా బతుకుతున్నారు. ఇంకోవైపు ఉద్యోగ భద్రత లేక అభద్రతలో ఉన్నారు. చాలా మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు లేవు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) మార్గదర్శకాల ప్రకారం ఒక బోధనా సిబ్బంది ఉంటే ముగ్గురు బోధనేతర సిబ్బంది ఉండాలి. ఈ మార్గదర్శకాలనూ కాలేజీ యాజమాన్యాలు పాటించడం లేదు. చాలా కాలేజీల్లో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సౌకర్యం లేదు. ఇలా ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. చట్టాలను పాటించకుండా యధేచ్చగా నడుపుతున్నాయి.
ప్రయివేటీకరణతో తప్పని తిప్పలు
ప్రయివేటీకరణలో భాగంగా తెలంగాణలో మొదటి ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీ 1980లో హైదరాబాద్లో చైతన్య భారతి ఇంజినీరింగ్ కాలేజీ (సీబీఐటీ) ఆవిర్భవించింది. ప్రస్తుతం తెలంగాణలో 190 ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. వాటిలో సుమారు 50 వేల మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. చట్ట ప్రకారం వేతనాలు అడుగుతున్న వారిపై కాలేజీ యాజమాన్యాలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి. వేధింపులకు గురిచేస్తున్నాయి. దీంతో చాలీచాలని వేతనాలతోనే పనిచేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ప్రజాప్రతినిధులకు చెందిన కాలేజీల్లోనూ నిబంధనలు ఉల్లంఘనకు గురవుతున్నాయి. కనీస వేతనాలు అమలు కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పనిచేస్తున్న వేలాది మంది దుస్థితి అధ్వానంగా ఉంది. కొన్ని కాలేజీల్లో సీనియర్లకు పదో పీఆర్సీ, కొందరికి తొమ్మిదో పీఆర్సీ, ఇంకొందరికి ఎనిమిదో పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇస్తున్నాయి. మరికొన్ని కాలేజీల్లో కనీస వేతనాల చట్టమే అమలు కావడం లేదు. చట్ట ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందరికీ ఒకటే వర్తింపచేయాలి. కానీ యాజమాన్యాలు ఉద్దేశపూర్వకంగానే పలు రకాలుగా వేతనాలు అమలు చేస్తున్నాయి. కాలేజీ ద్వారా వచ్చిన నిధులను ఆ కాలేజీ అభివృద్ధికి ఖర్చు చేయాలి. కానీ ఆ నిధులను ఎంబీఏ, ఎంసీఏ, ఇతర కాలేజీల అభివృద్ధికి కేటాయిస్తున్నాయి. ఇంకోవైపు ఏడాదికోసారి సిబ్బందికి బోనస్ ఇవ్వాలి. అదీ ఇవ్వడం లేదు. ఇలా ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు బోధనేతర సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వకుండా దోపిడీకి పాల్పడుతున్నాయి.
పోరాడితేనే హక్కులు అమలు భగత్సింహా
ఇంజినీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బందికి పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని తెలంగాణ ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల బోధనేతర సిబ్బంది సమాఖ్య ప్రధాన కార్యదర్శి భగత్ సింహా నవతెలంగాణతో చెప్పారు. అపాయింట్మెంట్ ఆర్డర్లు అందరికీ ఇవ్వాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందితే గ్రాట్యూటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆకస్మిక మరణం పొందితే ఉద్యోగి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల పిల్లలకు సూపర్న్యూమరరీ సీట్లు ఉండాలని డిమాండ్ చేశారు. ఉద్యోగి పనిచేసే కాలేజీలో వారి పిల్లలకు సీటొస్తే ఫీజు మాఫీ చేయాలన్నారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని డిమాడ్ చేశారు. ఏఐసీటీఈ నిబంధనలు పాటించాలన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ కాలేజీలో ఉద్యోగులకు వేతన సవరణ జరిగితేనే ఫీజు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. త్వరలోనే ఏఐసీటీఈ చైర్మెన్ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరతామన్నారు. పోరాడితేనే హక్కులు అమలవుతాయని చెప్పారు. ఈనెల 19న జరిగే సమ్మెలో ఇంజినీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది పాల్గొనాలని పిలుపునిచ్చారు.