Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా అరెస్టులు..సమస్యల పరిష్కారానికి జూపల్లి హామీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) మండల స్థాయి ఉద్యోగుల సంక్షేమ సంఘం(టీఆర్ఎస్కెవి) ఆధ్వర్యంలో బుధవారం సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వందలాది మంది ఉదయం తొమ్మిది గంటలకే క్యాంపు ఆఫీసుకు చేరుకున్నారు. దాదాపు 11 గంటల వరకు అక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇస్తామని, తమకు అపాయింట్మెంటు ఇవ్వాలని కోరినా, అధికారులు పట్టించుకోకపోవడంతో అక్కడే బైటాయించారు. సెర్ప్ హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, ఉద్యోగులకు కనీస వేతనం రూ.18500 ఇవ్వాలని, ఆఫీస్ సబార్డినేట్లకు రూ.10,500 ఇవ్వాలని, ఆరోగ్య భద్రత, ఆరోగ్య భీమా పథకం, హెల్త్కార్డులు జారీ చేయాలని, మహిళా ఉద్యోగులకు సెలవుతోకూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, స్త్రీ నిధి ఇన్సెంటీవ్లు సైతం వర్తింపజేయాలని, క్యాడర్ ఫిక్స్ చేయాలని, జాబ్చార్ట్ ఏర్పాటు చేసి పని ఒత్తిడిని తగ్గించాలని ఈ సందర్భంగా కోరారు. వీరంతా ప్లకార్డులు ప్రదర్శించారు. సమస్యలతోకూడిన నినాదాలు చేశారు. దీంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్స్టేషన్కు తరలించారు. సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు పది మందితో కూడిన ఉద్యోగుల బృందాన్ని పిలిపించుకుని నగరంలోని ఈజీఎంఎం కార్యాల యంలో చర్చలు జరిపారు. సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా సెర్ప్ మండలస్థాయి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి , కార్యదర్శి కె.నీల, కోశాధికారి సుమలత, తిరుపతిరెడ్డి, సత్యవతి, జ్యోతి, మల్లీశ్వరి ఇతర నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.