Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియంతృత్వ పాలనపై ఐక్య ఉద్యమాలు
- ఆర్థిక, సామాజిక దోపిడీ నిర్మూలనే టీమాస్ లక్ష్యం: రాజన్నసిరిసిల్ల జిల్లా కమిటీ ఆవిర్భావ సభలో వక్తలు
- ఆకట్టుకున్న బోనాలు, బతుకమ్మ ప్రదర్శనలు
నవతెలంగాణ-సిరిసిల్ల
రాష్ట్రంలో ప్రజాఉద్యమాలపై కొనసాగుతున్న అణచివేత విధానాలు ఇక చెల్లబోవని, సర్కారు నియంతృత్వ పాలనపై ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని వక్తలు అన్నారు. ఆర్థిక, సామాజిక, సంస్కృతిక దోపిడీ నిర్మూలనే లక్ష్యంగా టీమాస్ పోరాడుతుందన్నారు. తెలంగాణ ప్రజా, సామాజిక సంఘాల ఐక్య వేదిక (టీమాస్ ఫోరం) రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ సభ వాసవీ కల్యాణ మండపంలో బుధవారం జరిగింది. ఈ సంద ర్భంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలతో మహిళలు ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని సభావేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభ నిర్వహించారు. ప్రజా ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో సహజ వనరుల దోపిడీ సాగుతోందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యదర్శి, టీమాస్ ఫోరం సాంస్కృతిక విభాగం నాయకులు విమలక్క అన్నారు. ఇది భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం చేకూరుస్తుందన్నారు. అనేక నిర్బంధాల మధ్య సభ నిర్వహించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు. రాష్ట్ర సర్కారు మాట్లాడే హక్కునూ కూడా హరిస్తోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుట్టలను కొల్లగొట్టిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లాంటి నాయకులు టీఆర్ఎస్లో అంటకాగుతూ ఇసుక, ఇతర సహజవనరులనూ దోచుకుంటున్నారని వాపోయారు. దొరల గడీల పాలనలో నేరెళ్లలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి పోరాటాలు కొత్తకాదన్నారు. దొరతనాన్ని ఎదిరించి నిలబడి అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఉందని అన్నారు.
టీమాస్ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నామని సర్కారు అసత్యప్రచారానికి పూనుకుందన్నారు. 2013 ప్యాకేజీ ద్వారా నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇచ్చి ప్రాజెక్టులు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఎవరికీ అభ్యంతరం కాదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో వామపక్షాలతో చర్చించిన సీఎం కేసీఆర్.. అందరిని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారని, ఈ మూడేండ్లలో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ లక్ష్యంగా టీమాస్ పని చేస్తోందన్నారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక దోపిడీ సాగుతోందని, వాటిని కూలదోసే లక్ష్యంతో టీమాస్ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణాత్మకంగా ముందుకెళ్తున్నదని తెలిపారు. అనంతరం అరుణోదయ, ప్రజానాట్యమండలి కళాకారుల ఉద్యమగీతాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ ఆవిర్భావ సభలో 62 సంఘాలు పాల్గొన్నాయి. కార్యక్రమంలో టీమాస్ నాయకులు చెరుపల్లి సీతారాములు, కూరపాటి రమేశ్, పంతం రవి, ఎం.రమేశ్, జె.యాదగిరి, గొట్టె రుక్మిణి, పి.శంకర్గౌడ్, ఎం. రాజమల్లు, తదితరులు పాల్గొన్నారు.