Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లో వ్యాపారులు, అధికారుల కుమ్మక్కు
- దేవరకద్రలో ఉల్లి పారబోసి రైతుల నిరసన
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్లో వ్యాపారులు, అధికారులు కుమ్మక్కయ్యారు. రూ.1500 నుంచి 1400 పలుకుతున్న క్వింటాల్ ఉల్లి ధరను ఒకే రోజు రూ.400కు పడగొట్టేశారు. మంచి సరుకు అయితే రూ.500 ఇస్తామంటూ మెలికపెట్టారు. మద్దతు ధర కోసం మార్కెట్ యార్డు కార్యాలయం ఎదుట ధర్నా చేస్తే...అధికారులూ వ్యాపారులకే వత్తాసు పలికారు. ఇదెక్కడి అన్యాయం అంటూ ఉల్లిగడ్డలను సంచుల్లోంచి కింద పారబోసి రైతులు నిరసన తెలిపారు.
నవతెలంగాణ-దేవరకద్ర
దేవరకద్ర మండల పరిధిలోని బూరకొండ, గొప్లాపూర్, పెద్దచింతకుంట, ముష్టిపల్లి తదితర గ్రామాల నుంచి రైతులు ఉల్లిని విక్రయించడానికి దేవరకద్ర మార్కెట్యార్డుకు తీసుకొచ్చారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి క్వింటాల్ రూ.1400 నుంచి రూ. 1500 వరకు ఉండగా వ్యాపారులు మాత్రం సరుకు నాణ్యతను బట్టి కేవలం రూ.400 నుంచి రూ. 500లోపే ధర నిర్ణయించారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు ఉల్లిని మార్కెట్లో వదిలేసి మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. మద్దతు ధర కల్పించాలని నినాదాలు చేశారు. దాదాపు గంటసేపు వ్యాపారులు, రైతుల మధ్య మాటామాట పెరిగింది. వ్యాపారులు మాత్రం ధర పెంచేదిలేదని స్పష్టం చేశారు. మరోవైపు స్పందించాల్సిన మార్కెట్యార్డు అధికారులు వ్యాపారులకే వంత పాడటంతో రైతులు ఆగ్రహంతో అప్పటికే కాంటా వేసిన ఉల్లిని సైతం పారబోశారు. కూలీల ఖర్చులు, ఎరువుల విత్తనాలకైన పెట్టుబడులు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మార్కెట్ చైర్మెన్ జెట్టి నర్సింహారెడ్డి రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. దీంతో చివరకు రూ.1100కు కొనేలా వ్యాపారులను ఒప్పించడంతో రైతులు శాంతించారు. మార్కెట్లో ఇనాం విధానం పాటించకపోవడంపై మార్కెట్ సెక్రెటరీని నవతెలంగాణ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.