Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే..
- జిల్లాల ఎస్పీల కూర్పునకు సర్కారు సన్నాహాలు
- ఇప్పటికే కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి సిఫారసులు
- రహస్యంగా సాగుతున్న కసరత్తు
- అందులో తొలి అడుగే నాలుగు జిల్లాల ఎస్పీల బదిలీ?
- తాజాగా మహబూబ్నగర్ ఎస్పీగా అనురాధ నియామకం
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో తమకు అనుకూలమైన పోలీసు అధికారులను నియమించుకోవడంపై పాలక వర్గం దృష్టి సారించిందా? అందులో భాగంగానే జిల్లాల్లో డీఎస్పీలు మొదలుకుని ఎస్పీల వరకు అస్మదీయులు ఎవరు, తస్మదీయులు ఎవరనే కోణంలో సమాచార సేకరణ జరుగుతోందా? ఆ నేపథ్యంలోనే పోలీసు అధికారుల కూర్పును పాలక వర్గం అత్యంత రహస్యంగా సాగిస్తున్నదా? ఈ అనుమానాలకు పోలీసు శాఖలోని ఉన్నతాధికార వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019లో సాధారణ ఎన్నికలు జరగబోతున్న దృష్ట్యా ఇప్పటి నుంచే అధికార టీఆర్ఎస్ సర్కారు అందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసు కుంటున్నది. చూస్తుండగానే ఎన్నికలు సమీపిస్తుం డటంతో ఈ మారు కూడా అధికార పగ్గాలను దక్కించుకో వడానికి అవసరమైన ఎత్తుగడలకు సానపెడుతున్నది. అందులో భాగంగానే పోల్ మేనేజ్మెంట్లో కీలకమైన అంశాలలో ఒకటైన పోలీసు శాఖలో కూడా అవసరమైన మార్పులు చేర్పులకు సర్కారు రంగం సిద్ధం చేసుకుంటు న్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతల విభాగంలో డీఎస్పీలు మొదలుకుని జిల్లాల ఎస్పీల వరకు వారి పని తీరు(తమకు అనుకూలమా? కాదా?)ను అంచనా వేసే కార్యక్రమాన్ని అత్యంత రహ స్యంగా మదింపు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఆ కసరత్తును దాదాపుగా పూర్తి చేసిన పాలక వర్గం.. ఉత్తర తెలంగాణలో మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అనుకూలమైన పాలనా వ్యవస్థ ద్వారా ఎన్నికల ప్రక్రియలో తమకు అనుకూలం కాని అంశాలను సానుకూలం చేసుకునేందుకే ఈ ఎత్తుగడను పాలక పక్షం వేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి ఏలికలకు ఈ దిశగా కొన్ని విన్నపాలు, సిఫారసులు కూడా అందినట్టు తెలుస్తోంది. అయితే ఆ విన్నపాలు ఎలా ఉన్నా ఏలికల నుంచి నేరుగా మరో వైపు జిల్లాల పోలీసు హెడ్స్ పని తీరుపై మదింపు సాగుతున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే భవిష్యత్ కార్యాచరణకు పూనుకుంటున్నట్టు తెలిసింది. అలాగే ప్రస్తుతం పదోన్నతులు, కొత్త పోస్టింగ్ల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న ఇన్స్పెక్టర్లు మొదలుకుని అదనపు ఎస్పీ స్థాయి అధికారుల వరకు వారి జాబితాను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారని(ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యింది) విశ్వసనీయ సమాచారం. అధికారపార్టీ వేసుకుంటున్న స్కెచ్ ఆధారంగానే ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అభిమతం మేరకు కొందరు ఎస్పీల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన నాలుగు జిల్లాలు నల్లగొండ, సూర్యాపేట్, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల ఎస్పీల బదిలీల్లో ఇద్దరి పోస్టింగ్ ఈ కోవకు చెందినవేనని పోలీసు శాఖలో గుసగుసలు సాగుతున్నాయి. ఈ బదిలీల ఉత్తర్వు వెలువడ్డ కొద్దిసేపటికే మహబూబ్నగర్ జిల్లాకు నియమించబడ్డ ఎస్పీ విషయంలో మార్పు చోటు చేసుకుంది. మొదట నాగర్కర్నూల్ ఎస్పీ కలిమేశ్వర్ సింగేనావర్ను మహబూబ్నగర్ జిల్లా ఎస్పీగా నియమిస్తూ (ఈ జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి సెలవుపై వెళ్లారు) ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు. కాని ఏం జరిగిందో ఏమో కాని ఈ ఉత్తర్వును మార్చి కలిమేశ్వర్ను నాగర్కర్నూల్కు తిరిగి పంపిస్తూ, కొత్తగా సైబరాబాద్ అడ్మిన్ విభాగం అదనపు ఎస్పీ అనురాధను మహబూబ్నగర్ జిల్లా ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఇలా ఎందుకు జరిగిందని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని అడుగగా ఇదంతా పాలనా పరమైన నిర్ణయమని పొడిపొడి సమాధానం ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సబ్ డివిజన్ అధికారులు డీఎస్పీలు మొదలుకుని జిల్లాల ఎస్పీల వరకు దాదాపుగా కొత్త కూర్పు జరపడానికి అత్యంత రహస్యంగా కసరత్తును సర్కారు సాగిస్తున్నదని తెలిసింది. ఇందుకు కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడికలు తీసివేతలు జరుపుతున్నట్టు తెలిసింది. నవంబర్లో ప్రస్తుతం డీజీపీ అనురాగ్శర్మ పదవీ విరమణ చేయనున్నారు. కొత్త డీజీపీ వచ్చాకే తమ యాక్షన్ ప్లాన్ అమలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఒకవేళ వీలైతే ప్రస్తుత డీజీపీ పీరియడ్లోనే కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా లేక పోలేదని సమాచారం. ఈ విషయంలో రాష్ట్ర నిఘా విభాగంతో పాటు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి పాత్ర సైతం కీలకంగా మారినట్టు విశ్వసనీయ సమాచారం.