Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశం
- గురుకులాల పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాలికల గురుకుల విద్యాలయాల్లో బోధన, బోధనేతర పోస్టులను మహిళలకే కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన 1274 జీవోపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సత్యనారాయణ ఇతర అభ్యర్థులు వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మదన్ బీ లోకూర్, దీపక్గుప్తా ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురుకులాల పోస్టుల భర్తీకి అడ్డంకి తొలగిపోయింది. హైకోర్టులో విచారణ జరుగుతున్నందున అక్కడే తేల్చుకోవాలని ఆదేశించింది. తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ 2016, జూన్ 4న జారీ చేసిన జీవో నెంబర్ 1274 ఆధారంగా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనార్టీ సంక్షేమ గురుకుల బాలికలు, మహిళల విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర పోస్టులను మహిళలకే కేటాయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తొలుత హైకోర్టు 1274 జీవోపై స్టే విధించింది. ఆ తర్వాత స్టేను ఎత్తివేసింది. దీంతో గురుకులాల్లోని టీజీటీ, పీజీటీ, పీఈటీ, పీడీ, లైబ్రరియన్, స్టాఫ్నర్సు, భాషాపండితుల పోస్టులకు రాతపరీక్షలు జరిగాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూశారు. సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందోనని ఆందోళన చెందారు. స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ప్రశాంతంగా లైబ్రరియన్, పీఈటీ పరీక్షలు
రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో ప్రకటించిన లైబ్రరియన్, పీఈటీ పోస్టులకు ఆదివారం జరిగిన రాతపరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ వాణీప్రసాద్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 23 కేంద్రాల్లో జరిగిన లైబ్రరియన్ పోస్టులకు 10,771 మంది దరఖాస్తు చేయగా, 69.27 శాతం మంది హాజరయ్యారని తెలిపారు. 33 కేంద్రాల్లో నిర్వహించిన పీఈటీ పోస్టులకు 15,915 మంది దరఖాస్తు చేస్తే, 75.10 శాతం పరీక్ష రాశారని పేర్కొన్నారు.