Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 150 కోట్ల అవినీతి : రేవంత్, శోభారాణి
- నేడు నిరసనకు పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బతుకమ్మ చీరల కోనుగోళ్లలో మధ్యదళారులు రూ. 150 కోట్లు స్వాహా చేశారని తెలుగుదేశం తెలంగాణ శాఖ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి, తెలుగుమహిళ అధ్యక్షులు బండ్రు శోభారాణి ఆరోపించారు. సూరత్ లో కేజీల లెక్కన కొన్న పాలిస్టర్ చీరలను సిరిసిల్ల చేనేత చీరలుగా పంపిణీ చేసి పేదోళ్ల పేదరికాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్, ఆ శాఖా మంత్రి కేటీఆర్ వెక్కిరించారని, ఆడబిడ్డలందరినీ అవమానించారని ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల నాణ్యతపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈమేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తగా బతుకమ్మ చీరలతో నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో రేవంత్, ఎన్టీఆర్ భవన్లో శోభారాణి వేర్వేరుగా విలేకర్లతో మాట్లాడారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో బతుకమ్మ చీరలతో టిడిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చినట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు విజయరమణరావు, టిడిపి అధికార ప్రతినిధి వేంనరేందర్ రెడ్డి, మహిళా నాయకులు షకీలారెడ్డి, అనూషరామ్, ఠూన్సీ లక్ష్మి, ఎన్.మమత, ప్రమీల పాల్గొన్నారు.