Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెట్రోల్, డీజిల్ను వెంటనే జీఎస్టీలో చేర్చాలని పట్నం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే.వేణుగోపాలరావు, డీజీ నర్సింహారావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని నియంత్రించకపోగా.. ఎక్సైజ్, వ్యాట్ పన్నులతో పెంపుతో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై మరింత భారం మోపుతున్నదని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్ లక్టికాపూల్లో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో వారు పాల్గొని ప్రసంగించారు. గడిచిన మూడేండ్లలో క్రూడాయిల్ ధరలు 50 శాతం తగ్గినా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. పొరుగు దేశాలు పెట్రోలు లీటర్కు రూ.65-రూ.80 వరకు, డీజిల్ను రూ.58-రూ.63 విక్రయిస్తున్నాయని చెప్పారు. అమెరికాలో ఇటీవల జరిగిన హార్వే, ఇర్మా హరికేన్ల ప్రభావం వల్లే ధరలు పెరిగాయని కేంద్రం బూటకపు మాటలు వల్లిస్తున్నదని విమర్శించారు. జూలై 1 నుంచి అన్ని సరుకులపై జీఎస్టీ అమలు చేస్తున్న మోడీ సర్కార్ పెట్రోల్, డీజిల్పై ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. జీఎస్టీ వేస్తే పెట్రోల్ లీటర్కు ధరలు రూ.40 నుంచి రూ.50కు దిగివస్తుందని చెప్పారు. ధరల పెంపును నిరసిస్తూ రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. పెట్రోల్, డీజిల్ భారాలు మధ్యతరగతి నెలసరి ఆదాయాల్లో మూడో వంతు రవాణా ఖర్చులకే సరిపోతుందని, మిగిలిన నిత్యావసర తగ్గించుకొని బతకాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వివిధ రకాల పన్నులను తొలగించి జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ వివిధ డివిజన్లలోని పట్నం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరీని ఎండగట్టారు.