Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశ్రమలశాఖలో కొనసాగుతున్న వివక్ష
- అడుగడునా అవమానాలు - ఛీత్కారాలు
- అసెంబ్లీ నుంచి పార్లమెంట్ దాకా సెక్రటేరియట్ నుంచి జాతీయ ఎస్టీ కమీషన్ వరకూ
- ఉద్యోగోన్నతి కోసం 13 ఏండ్లుగా అలుపెరుగని పోరాటం
- ఇదీ డిప్యూటీ మేనేజర్ నర్సింగ్రావు పోరాట గాథ
నవతెలంగాణ - హైదరాబాద్ సిటీబ్యూరో
టీఎస్ ఐపాస్...పేరు వినగానే ప్రపంచంలోనే తెలంగాణ అగ్రగామిగా పేరొందినట్టు సీఎం కేసీఆర్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్లు చెప్పిన సందర్భాలు అనేకం. అంతటి పేరుగాంచిన రాష్ట్ర పరిశమ్రల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఐడీసీ)లో అంటరాని కులాలకు చెందిన ఉద్యోగులపై కులం కుట్రలు కత్తులు దూస్తున్నాయి. పరిపాలనా యంత్రాంగానికి రూపొందించిన చట్టాలు ఈ శాఖలో పనికిరాకుండా పోయాయి. ప్రభుత్వ జీవోలు చెల్లుబాటు కావట్లేదు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలేవీ ఇక్కడసలే అమలు కావు. అగ్రకులానికి చెందిన ఉద్యోగులకు అడ్డదారుల్లోనైనా న్యాయం జరుగుతుందిగానీ...నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేసే ఎస్టీ సామాజికతరగతికి చెందిన ఉద్యోగికి మాత్రం రహదారిలో ఎంత దూరం ప్రయాణం చేసినా న్యాయం మాత్రం దొరకడం లేదు. పైగా 'ఓ ఎరుకలోడు ప్రమోషన్ పొంది ఉన్నతాధికారి అయితే వాడికింద మనం పనిచేయాలా...' అంటూ అగ్రకుల ఉద్యోగులు అడుగడునా అవమానాలకు గురిచేస్తున్నారు. న్యాయబద్ధంగా తనకు రావాల్సిన ఉద్యోగోన్నతి కోసం 13 ఏండ్లుగా సుధీర్ఘమైన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్న నర్సింగ్రావు పోరాట గాథ ఇదీ..!
ప్రభుత్వాన్ని, జాతీయ ఎస్టీ కమిషన్ను తప్పుదారి పట్టించి...
రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం డిప్యూటీ మేనేజర్ (అడ్హక్)గా పనిచేస్తున్న ఎం.నర్సింగ్రావు 2004లో సీనియర్ అసిస్టెంట్. ఆ సమయంలో 2003 రూల్ ఆఫ్ రిజర్వేషన్ జీవో నిబంధనల ప్రకారం... 2004లోనే అసిస్టెంట్ మేనేజర్గా, 2009లో డిప్యూటీ మేనేజర్గా, 2011లో మేనేజర్గా, 2016లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఉద్యోగోన్నతి పొందే వీలుంది. కానీ, పరిశ్రమలశాఖలో అగ్రకుల ఆధిపత్య భావాలను నిలువెల్లా నింపుకున్న కొంతమంది ఉద్యోగులు నర్సింగరావుకు ఉద్యోగోన్నతి రాకుండా అనేక కుట్రలు చేశారనే ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే 2003 రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్ఓఆర్) జీవోని అదే ఏడాది పరిశ్రమలశాఖ అడాప్ట్ చేసుకున్నప్పటీకీ, అడాప్ట్ చేసుకోలేదని, ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదనీ, కేవలం రిక్రూట్మెంట్ సమయంలో మాత్రమే ఆర్ఓఆర్ వర్తిస్తోందని అక్కడున్న అగ్రకుల అధికారులు ఇటు ప్రభుత్వాన్ని, అటు జాతీయ కమిషన్ను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాదు... 'నీ ప్రమోషన్ కోసం ఇన్నేండ్లుగా తిరుగుతున్నావు. అనేక మందికి ఫిర్యాదు చేశావు కదా... ఇక మిగిలింది ఇద్దరే ఇద్దరు... ఒకరు సీఎం కేసీఆర్, మరొకరు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్. వారికి చెప్పుకున్నా మమ్మల్నీ ఏం చేయలేవు. మళ్లీ ఇదే రిపీట్ అవుద్దీ.. ఈలోపు నీవు రిటైర్మెంట్ అవుతావు' అంటూ ఉన్నతాధికారులు హేళన చేయడం విశేషం.
ఉన్నత స్థాయి ఉద్యోగోన్నతి రాకుండా ...
ప్రమోషన్ కోసం 2004 నుంచే అనేక పర్యాయాలు అధికారులు, ఉన్నతాధికారులు చుట్టూరా తిరిగిన నర్సింగ్రావు విసిగి.. వేసారి పలు సందర్భాలలో టీఎస్ఐడీసీ వైస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (వీసీఅండ్ఎండీ)కు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శికి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు, జాతీయ ఎస్టీ కమిషన్కు, రాష్ట్ర అసెంబ్లీలోని ఎస్టీ సెల్ విభాగంలో, పార్లమెంటులో, జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. టీఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ, ముఖ్యకార్యదర్శి, జాతీయ ఎస్టీ కమిషన్లు పరిశీలించి నర్సింగ్రావు అన్నివిధాలుగా ప్రమోషన్కు అర్హుడని, వెంటనే ప్రమోషన్ కల్పించాలని ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలు అమలుకావడం కోసం నర్సింగ్రావు మరో పోరాటం చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు... ఆ ఆదేశాల అమలును తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఏడాదిన్నర ఆలస్యంగా 2012లో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగోన్నతి కల్పించారు. 2016 అక్టోబర్లో నర్సింగ్రావుకు మరలా ఉద్యోగోన్నతి కల్పించినట్టు చెప్పుకోవడం కోసం... ఒక్క ఎస్టీ పోస్టు మాత్రమే ఖాళీగా ఉంటే, అగ్రకులాలకు చెందిన వారికంటే ఈయన సీనియర్ కాకుండా ఉండేందుకు, ఆ తర్వాత వచ్చే మరో (అత్యున్నత పోస్టు) ఉద్యోగోన్నతి రాకుండానే రిటైర్డ్ అయ్యేలా ప్రణాళిక రచించి, ఈయనతోపాటు మరో నాలుగు పోస్టులను క్రియేట్ చేసి మొత్తం ఐదుగురికి డిప్యూటీ మేనేజర్గా ఉద్యోగోన్నతి కల్పించారు. అదికూడా నర్సింగ్రావుకు ఇచ్చిన ఉద్యోగోన్నతి అడ్హక్ మాత్రమే కావడం విశేషం. పోస్టులు లేకపోయినా అగ్రకులాల వారికి పోస్టులు క్రియేట్ చేసి ఉద్యోగోన్నతి ఇవ్వడం చట్ట విరుద్ధమని తెలుస్తున్నది.
డిప్యూటీ మేనేజర్ స్థాయిలోనూ.. వివక్ష
నర్సింగ్రావుకు 12 ఏండ్ల సుధీర్ఘ పోరాటం ఫలితంగా 2016లో డిప్యూటీ మేనేజర్గా ఉద్యోగోన్నతి లభించింది. ఈయనతోపాటు మిగతా నలుగురికి పర్మినెంట్ డిప్యూటీ మేనేజర్లుగా పోస్టులిచ్చి, ఖాళీ ఉన్న (ఒరిజనల్ పోస్టు) పోస్టుకు మాత్రం పర్మినెంట్ కాకుండా అడ్హక్ డిప్యూటీ మేనేజర్గానే ఇవ్వడం మరోసారి వీరి కపటనీతి బట్టబయలైంది. ఇదిలా ఉండగా ఉద్యోగోన్నతి పొందిన వారు పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్రంజన్ వద్ద డిప్యూటేషన్పై ఒకరు పనిచేస్తుండగా మిగతా వారంతా పరిశ్రమల భవన్లోనే పనిచేస్తున్నారు. వీరిలో ఒక్కరికి మాత్రమే ప్రత్యేక క్యాబిన్, కార్ సౌకర్యం, ఫోన్ సదుపాయం ఉంది. మొదట్నుంచి వివక్షకు గురవుతున్న ఎం.నర్సింగ్రావుకు మాత్రం క్యాబిన్ సౌకర్యం, కారు, కనీసం ఫోన్ సదుపాయం కూడా కల్పించకపోవడం పరిశ్రమల శాఖలో కుల వివక్ష ఏ స్థాయిలో ఉందో అద్దంపడుతున్నది.
29న నర్సింగ్రావు ఉద్యోగ విరమణ ..
టీఎస్ఐడీసీలో 2004లోనే ఉద్యోగోన్నతి పొందాల్సిన ఎం.నర్సింగ్రావును అగ్రకులాల ఉద్యోగులు అడ్డుకోవడంతో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాలో రిటైర్ కావాల్సిన ఎస్టీ ఉద్యోగి నర్సింగ్రావు అడ్హక్ డిప్యూటీ మేనేజర్ స్థాయిలోనే ఈ నెల 29న రిటైర్ కావాల్సిన దుస్థితి దాపురించింది. నర్సింగ్రావు ఉద్యోగోన్నతి విషయంలో పరిశ్రమల శాఖ, జాతీయ ఎస్టీ కమిషన్లు ఎన్ని ఆదేశాలు చేసినా ఫలితం లేకుండాపోయింది. ఇప్పటికైనా రాజ్యాంగ నిబంధనలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తనకు రావాల్సిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగోన్నతి కల్పించాలని, ఇప్పటివరకూ ఉద్యోగోన్నతుల ప్రకారం ఎరియర్స్ బకాయిలను చెల్లించాలని, తన పట్ల కుల వివక్ష పాటించి, అనేక అవమానాలకు గురిచేసిన ఉన్నతాధికారులపై విచారణ జరిపి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నర్సింగ్రావు డిమాండ్ చేస్తున్నారు.