Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4 టీఎంసీలు కేటాయించండి : తెలంగాణ
- కృష్ణా బోర్డుకు లేఖలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 17 టీఎంసీల నీటిని ఏపీ, కల్వకుర్తి కోసం తమకు 4 టీఎంసీలు తెలంగాణ కోరాయి. ఈ మేరకు కృష్ణా బోర్డుకు రెండు రాష్ట్రాలు లేఖలు రాశాయి. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం బ్యారేజీలో నీటి మట్టం సోమవారం నాటికి 86.84 టీఎంసీలకు చేరటంతో నీటి విడుదల కోసం రెండు రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. ఏపీ కోరిన 17 టీఎంసీల్లో ఒక టీఎంసీ ఆవిరికి పోగా పోతిరెడ్డిపాడు నుంచి 5 టీఎంసీలు, హంద్రీనీవా ద్వారా 5 టీఎంసీలూ పోను నాగార్జునసాగర్ కుడి కాల్వకు మరో 6 టీఎంసీలు కావాలని ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ కోరింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద చెరువులు నింపడానికి 4 టీఎంసీలు నీరు తెలంగాణ కోరింది. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా ఏపీ ఇప్పటికే నీటని తరలిస్తుండగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని రెండు మోటార్ల ద్వారా తెలంగాణ కూడా నీటిని వినియోగించుకుంటున్నది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానిని నీటిని విడుదల చేసే 854 మీటర్ల స్థాయికి శ్రీశైలంలో నీటి మట్టం చేరుతున్నదని భావిస్తున్న ఏపీ నీటిని తరలించటానికి సన్నాహాలు చేస్తున్నది. నాగార్జునసాగర్ డ్యాంకు ఇప్పటి వరకూ నీటిని విడుదల చేయకపోవటంతో ఇప్పటికీ డెడ్స్టోరేజీ స్థాయి కన్నా 10 అడుగులు తక్కువగానే నీటి నిల్వ ఉన్నది. ఈ రిజర్వాయర్లో డెడ్స్టోరేజీ స్థాయి 510 అడుగులు కాగా 500.9 అడుగులుగా ఉన్నది. ఇప్పుడున్న నీటి నిల్వతో జంటనగరాలకు, నల్లగొండ జిల్లాకు తాగునీరు సరఫరా చేయటం కష్టతరంగా మారింది. ఈ దశలో వెంటనే మరో తొమ్మిది టీఎంసీల నీరు విడుదల చేస్తేనే తాగునీటి సమస్య తీరుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ భావిస్తున్నది. జంటనగరాలు, నల్లగొండ తాగు నీటి అవసరాల గురించి పట్టించుకోకుండా కుడి కాల్వ కోసం 6 టీఎంసీల నీటిని ఏపీ కోరటాన్ని తెలంగాణ తప్పుపడుతున్నది. ముందుగా సాగర్లో 510 అడుగుల స్థాయికి నీరు చేరితేనే కుడి కాల్వ విషయం ఆలోచిస్తామని తెలంగాణ ఇంజనీర్లు అంటున్నారు.
శ్రీశైలంలో పెరుగుతున్న నీటి మట్టం...
ప్రస్తుత నీటి సంవత్సరంలో మొదటి సారి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. సోమవారం ఈ ప్రాజెక్టులో ఇన్ఫ్లో 1,70,497 క్యూసెక్కులు కాగా నీటి నిల్వ 86.84 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం డ్యాంలో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.81 టీఎంసీలు కాగా మరో రెండు రోజుల్లో 100 టీఎంసీలకు చేరుతుందని ఇంజినీర్లు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 853 అడుగులుగా ఉన్నది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,92,126 క్యూసెక్కుల నీరు విడుదల చేయటంతో శ్రీశైలంలో ఇంకా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉన్నది. జూరాల ప్రాజెక్టులో ఇన్ఫ్లో 1,85,000 గా ఉన్నది. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.15 టీఎంసీలుగా ఉన్నది. నారాయణపూర్, ఉజ్జయిని డ్యాంల నుంచి నీరు భారీగా విడుదల చేయటంతో జూరాలకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది.