Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం కోసం సర్కార్పై సమ్మె సైరన్
- రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు సమాయత్తం
- షెడ్యూల్డ్ ఎంప్లాయీస్ జీఓలను సవరించాలని సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమస్యల పరిష్కారం కోసం కార్మికులు కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు. షెడ్యూల్డ్ పరిశ్రమల జీఓలను సవరించాలని, కనీస వేతనం రూ.18 వేలు, సమాన పనికి సమాన వేతనం, వీడీఏ ప్రతి పాయింట్కు రూ.10.50 పైసలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు చేసేందుకు నడుంబిగించారు. ఈ నిరసన ప్రదర్శనల్లో లక్షలాదిగా అన్ని వర్గాల కార్మికలోకం పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు నేతృత్వంలో ఉద యం 11.30 గంటలకు హైదరాబాద్, కార్మిక శాఖ ప్రధాన కార్యాలయం వద్ద జరిగే సభలో పాల్గొనను న్నారు. జాతీయ ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్.. యాదాద్రి భువనగిరి జిల్లాలో, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.రమ.. కామారెడ్డిలో జరిగే సభలో ప్రసంగి స్తారు. రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు.. సంగారెడ్డి లోని చార్మినార్ బీబీ ఫ్యాక్టరీ వద్ద రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్.. చర్లపల్లి సురానా చౌరస్తా వద్ద జి మధు.. మంచిర్యాల్లో, మల్లికార్జున్.. పఠాన్ చెరువు చౌరస్తాలో జరిగే సభల్లో పాల్గొంటారు. కాగా, సమ్మెను విజయవంతం చేసేందుకు నెల రోజు లుగా సీఐటీయూ వివిధ కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. అన్ని జిల్లాలు, మండలాల్లోని బస్తీలు, ఇతర మురికివాడలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులతో అవగాహన సదస్సులు నిర్వహించింది. జాతలు, కరపత్రాలు, పోస్టర్లతో విస్తృత ప్రచారం చేసి కార్మికులను సమ్మెకు సిద్ధం చేసింది.
బోర్డు సిఫారసు చేసినా స్పందించని సీఎం
రాష్ట్రంలో 73 షెడ్యూల్ ఎంప్లాయీస్ పరిశ్రమలు ఉన్నాయి. వీటికి సంబంధించిన జీఓలను ప్రభుత్వం ప్రతి ఐదేండ్లకు సవరించాల్సి ఉంటుంది. కాని రాష్ట్రంలో ఆ విధంగా జరగడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే కొన్ని జీఓలకు కాలపరిమితి ముగిసింది. తెలంగాణ ఏర్పడ్డాక మరికొన్ని జీఓలది అదే పరిస్థితి. ఆ విధంగా ఇప్పటి వరకు 71 జీఓలకు కాలం చెల్లింది. సాధారణంగా కార్మికులకు వేతనాలు పెరగాలంటే షెడ్యూల్ ఎంప్లాయీస్ జీఓలను సవరించాలి. అలా జరగకపోవడంతో లక్షలాది మంది కార్మికులకు కనీస వేతనాలు అందక తీవ్రంగా నష్టపోతున్నారు. 2014లో ప్రభుత్వం కనీస వేతనాల సలహా మండలి బోర్డును ఏర్పాటు చేసింది. కార్మికులకు నెలకు రూ.12 వేల కనీస వేతనం, వీడీఏ పాయింట్కు రూ.10.50 పైసలు చెల్లించే విధంగా జీఓలను సవరించాల్సిందిగా బోర్డు సభ్యులు ప్రభుత్వానికి సిఫారసు చేసినా ఫలితం లేదు. 2016లో బోర్డు కాలపరిమితి ఐపోయింది. కొన్ని నెలల క్రితం మరో కొత్త బోర్డు ఏర్పాటైంది. సభ్యులు పాతబోర్డు సూచించిన ప్రతిపాదనలనే సిఫారసు చేశారు. 34 జీఓలను సవరించాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం ఇందుకు సంభంచిన దస్త్రం ముఖ్యమంత్రి వద్ద సిద్ధంగా ఉన్నది. సంతకం చేస్తే కార్మికులకు కనీస వేతనాలు అందుతాయి. వీడీఏ వర్తిస్తుంది. కానీ సీఎం మొండికేస్తుండటంతో దస్త్రం నెలలుగా మూలుగుతున్నది. కార్మికుల కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా కనీస వేతనాల సలహా మండలి బోర్డు సిఫార్సు చేస్తే వెంటనే ఆమోదిస్తారు. కానీ సీఎం కేసీఆర్ అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తుండం విశేషం. మరోవైపు జీఓలు పూర్తిగా పరిశ్రమలకు సంబంధించినవి. ప్రభుత్వంపై రూపాయి భారం పడదు. ప్రయివేటు యాజమాన్యాలతో ముఖ్యమంత్రి కుమ్మక్కవడం వల్లే సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో కనీస వేతనాల చట్టం ఉల్లంఘనకు గురవుతున్నదని కార్మికసంఘాలు ఆరోపిస్తున్నాయి. పాత జీఓలు కూడా అమలుకు నోచుకోని పరిస్థితి. ఇలాంటి ఎన్నో సమస్యలపై సీఐటీయూ రాష్ట్ర కమిటీ దశల వారీ ఆందోళనలు చేసింది. ప్రభుత్వం మొండి వైఖరీ వీడకపోవడంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.