Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబంలో ఆరుగురి ఆత్మహత్య
- మృతుల్లో ఇద్దరు చిన్నారులు
- దెబ్బతీసిన షేర్మార్కెట్..
- దళారుల చేతిలో మోసపోయిన చిన్నకొడుకు
- ఉద్యోగం కోసం రూ.14 లక్షలు
- సూసైడ్నోట్లో మోసం చేసినవారి పేర్లు..
నవతెలంగాణ-సూర్యాపేట
అప్పులు కుటుంబాన్ని బలితీసుకున్నాయి. ఇద్దరు చిన్నారులకు పురుగులమందు తాగించి, నలుగురు పెద్దలూ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులు చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి పెద్దకొడుకు నష్టపోగా, ఉద్యోగం ఇప్పిస్తామంటే దళారుల చేతిలో లక్షలు పెట్టి చిన్నకొడుకు నష్టపోయాడు. దీంతో ఆ కుటుంబం అప్పులపాలై చివరకు ప్రాణం విడిచింది. ఈ హృదయవిదారకరమైన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. పట్టణంలోని కస్తూరి బజార్లో నివసిస్తున్న కస్తూరి జనార్ధన్(59), చంద్రకళ(54) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సురేష్కు భార్య నాగమణి(26), కుమార్తెలు సాన్విక(6), రుత్విక(2) ఉన్నారు. సురేష్ కొంతకాలంగా స్టాక్మార్కెట్ వ్యాపారం నిర్వహిస్తూ ఆర్థికంగా దెబ్బతిన్నాడు. అప్పులిచ్చిన వారు ఒత్తిడి తేవడంతో ఈనెల 11న పూణె వెళ్తున్నానని భార్యకు చెప్పి వెళ్లాడు. మరుసటి రోజు ముంబాయి వెళ్తున్నానని చెప్పి సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. భర్త ఆచూకీ తెలువకపోవడంతో ఈనెల 15న పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలియకగానే, అతని స్నేహితులతో పాటు చాలామంది ఇంటికి వచ్చి తమ దగ్గర సురేష్ రూ.లక్షలు అప్పులు తీసుకున్నాడని, చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఇదిలా ఉండగా జనార్ధన్ రెండో కుమారుడు అశోక్(27) ఇంటర్ చదివాడు. సూర్యాపేటకు చెందిన ఇద్దరు దళారులు ఆయనకు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.14 లక్షలు తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి పదిన రంగారెడ్డి కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న సివిల్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చినట్టు నియామకపు పత్రం, గుర్తింపుకార్డు తెచ్చి ఇచ్చారు. వాటిపై కోర్టు అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసి పెట్టారు. అక్కడికి వెళ్లి విచారించగా అది నకిలీ నియామకపు పత్రమని తేలింది. దీంతో కంగుతిన్న అశోక్.. దళారులు వెంపటి సత్యనారాయణ, ఉపేందర్పై ఒత్తిడి తేగా, ఈనెల 10వ తేదీలోగా డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి బాండ్పేపర్పై రాసి ఇచ్చారు. కానీ తిరిగి చెల్లించలేదు. దీంతో మోసపోవడమే కాకుండా తండ్రి డబ్బులను పోగొట్టాననే మనస్తాపానికి గురయ్యాడు. ఈ రెండు సంఘటనలతో కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. అవమానం, ఒత్తిడిలు భరించలేక ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూల్డ్రింక్లో పురుగులమందు కలిపి ఇద్దరు చిన్నారులకు తాగించారు. తరువాత జనార్ధన్, భార్య, కోడలు, చిన్న కొడుకు తాగారు.
సూసైడ్ నోట్లు
చనిపోయే ముందు అశోక్, నాగమణి వేర్వేరుగా సూసైడ్ నోట్లు రాశారు. తమను ఎవరెవరు మోసం చేశారో... ఎవరెవరు ఇబ్బందులకు గురిచేశారో వారి పేర్లు అందులో పేర్కొన్నారు. అలాగే, ఆ లేఖలో తమ కుటుంబ సభ్యులను పోస్టుమార్టం చేయించొద్దని, తమ దగ్గర ఉన్న రూ.69వేలతో దహన సంస్కారాలు చేయించాలని పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ ప్రకాశ్జాదవ్, డీఎస్పీ నాగేశ్వర్రావు పరిశీలించారు. మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు పటేల్ రమేష్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్ బి.దుర్గయ్య అక్కడికి చేరుకొని ఘటనపై విచారం వ్యక్తం చేశారు.