Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారిది నేలబారు రాజకీయం :విపక్షాలపై కేటీఆర్ గుస్సా
- అవన్నీ కృత్రిమ నిరసనలు
- 'చీరల' విషయంలో లోపాలుంటే సరి చేసుకుంటాం
- కాంగ్రెసోళ్లకుచేనేతకు, మరమగ్గానికి తేడా తెలియదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బతుకమ్మ చీరలను కాల్చివేసే వారిని అరెస్టు చేయిస్తామని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో విపక్షాలు నేలబారు రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నీచాతి నీచమైన రాజకీయాలకు పాల్పడటం సరికాదని కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోమవారం సచివాలయంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అజరుజైన్, చేనేత సంచాలకులు శైలజా రామయ్యర్తో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. చీరల నాణ్యత విషయంలో కాంగ్రెస్, టీడీపీలు బట్టకాల్చి మీదేసే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరలను తగలబెట్టటాన్ని ఆయన కృత్రిమమైన నిరసలుగా అభివర్ణించారు. సోమవారం ఒక్కరోజే 25 లక్షల చీరలను పంపిణీ చేశామని తెలిపారు. అందులో 250 చీరలు నాసిరకంగా ఉంటే.. వాటిని పట్టుకుని గోరంతలు కొండంతలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని మహిళలందరూ బతుకమ్మ చీరలను 'తమ పుట్టింటి వారు పెట్టిన చీరలుగా భావిస్తున్నారు...' అని వ్యాఖ్యానించారు. ఒకవేళ వారికి నిజంగా నాసిరకం చీరలను పంపిణీ చేసినా.. వాటిని వారు తగులబెట్టబోరని చెప్పారు. చీరలను మహిళలు పవిత్రంగా చూడటమే దీనికి కారణమని తెలిపారు. చీరలను కాల్చిన వారందరూ విపక్షాలకు చెందిన వారేనని విమర్శించారు. జగిత్యాల, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మాత్రమే ఇలాంటి ఘటనలు జరిగాయని తెలిపారు. ఇలాంటి చిల్లరమల్లర రాజకీయాలకు పాల్పడవద్దని విపక్షాలకు హితవు పలికారు.