Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధనిక రాష్ట్రంలో నిధుల్లేక జీహెచ్ఎంసీ దివాలా
- వచ్చే నెల జీతాలివ్వడమూ కష్టమే?
- బ్యాంకు రుణం 2500 కోట్లు కావాలంటే ఆస్తులు తనఖా పెట్టాల్సిందే : నిపుణులు
- బాండ్ల ద్వారా మరో రూ.1000 కోట్లు
- అనుమతి కోసం సర్కార్కు లేఖ
- ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ : జీహెచ్ఎంసీ కమిషనర్
జీహెచ్ఎంసీ తన ఆస్తులను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ అవసరాల కోసం, హైదరాబాద్ నగరాభివృద్ధి, పలు ప్రాజెక్టుల పూర్తి కోసం సర్కారు సూచన మేరకు బ్యాంకుల నుంచి రూ.2,500 కోట్లు, బాండ్ల ద్వారా రూ.1000 కోట్లు సేకరించేందుకు కసరత్తు చేస్తోంది.కనీసం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిల్లోకి కూరుకుపోయిన నేపథ్యంలోనే ఈ చర్యకు పూనుకున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం బల్దియాకు సాయం చేయకపోగా జీహెచ్ఎంసీకి ఇచ్చే నిధులను కూడా విడుదలచేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు ప్రచారం జరుగుతున్నది. 'హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తాం. రూ.20వేల కోట్లతో నగరంలో ఫ్లైఓవర్లు, స్కైవేలు నిర్మిస్తాం. రూ.11 వేల కోట్లతో డ్రెయినేజీ వ్యవస్థ బాగుచేస్తాం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తాం' అని ఇచ్చిన హామీలన్నీ పట్టాలెక్కడం ప్రశ్నార్థకంగా మారింది.
* నిరంజన్ కొప్పు
రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్(జీహెచ్ఎంసీ)కి సాయం చేయకపోగా...ఇచ్చే నిధుల విషయంలోనూ తాత్సారం చేస్తున్నది. దీంతో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్న జీహెచ్ఎంసీ నిధుల్లేక దివాళా తీసింది. 2015 -16లో రూ.428 కోట్లు కేటాయించి రూ.23 కోట్లు మాత్రమే విడుదల చేశారు. 2016-17 బడ్జెట్లో రూ.70.30 కోట్లు కేటాయించి కేవలం రూ.1.32 కోట్లే విడుదల చేశారు. 2017-18 బడ్జెట్లో ప్రణాళికేతర నిధుల కింద రూ.67.28 కోట్లు కేటాయించారు గానీ నయాపైసా విడుదల చేయలేదు. గతేడాదికి సంబంధించిన స్టాంపు డ్యూటీ ఫీజు కింద సర్కా,ర్ నుంచి రావాల్సిన రూ.320 కోట్లకుగాను రూ.80 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా రూ.240 కోట్లు రావాల్సిన ఉంది. ఆర్టీసీకి రూ.336 కోట్లు చెల్లించారు. స్ట్రాటజిక్ రోడ్డు డెవపల్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) కోసం రూ.200 కోట్లు, డబుల్బెడ్ రూమ్ ఇండ్ల కోసం రూ.100 కోట్లు ఖర్చుచేశారు. జీహెచ్ఎంసీలో వేతనాలు, పింఛన్లు, వీధిదీపాల నిర్వహణ కోసం నెలకు రూ.110 కోట్లు అవసరం. కానీ, ప్రస్తుతం ఖజానాలో రూ.25 కోట్లు మాత్రమే ఉన్నాయి. వీటికితోడు ప్రభుత్వం నుంచి 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన రూ.53 కోట్లు వచ్చాయి. వీటిన్నింటితో సెప్టెంబర్ వేతనాలకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. కానీ, అక్టోబర్ నుంచి వేతనాలు ఎలా ఇవ్వాలో అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో దిక్కులేక ఆస్తులను తాకట్టు పెట్టి నిధులను సమీకరించుకునేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న దాఖలాల్లేవు. 15 ఏండ్ల కింద బాండ్ల ద్వారా రూ.100 కోట్లు సేకరించినట్టు సమాచారం. ప్రస్తుతం రూ.1000 కోట్లు సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 'తెలంగాణ ధనిక రాష్ట్రమైతే జీహెచ్ఎంసీకి ఇవ్వాల్సిన నిధులను ఎందుకివ్వడంలేదు. నిధుల్లేక జీహెచ్ఎంసీ దివాళా తీయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది'అని పలువురు ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిధుల్లేక ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో బల్దియా కొట్టుమిట్టాడుతుంటే మరోపక్క బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని నగరంలో ఎస్ఆర్డీపీ ద్వారా ఫ్లైఓవర్లు, పేదలకు డబుల్బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామంటూ ప్రభుత్వం చెప్పడం శోచనీయమని పౌరసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడమంటే జీహెచ్ఎంసీకి చెందిన ఆస్తులను తాకట్టు పెట్టడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కుదువ పెట్టక తప్పదా..?
బ్యాంకుల నుంచి రూ.2,500 కోట్ల రుణం, బాండ్ల ద్వారా రూ.1000 కోట్లు సేకరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అనుమతి కోసం మూడురోజుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు లేఖ కూడా రాశారు. అంతేకాదు కేర్ అనే ఆర్థికరంగ సంస్థచే సర్వే చేయించుకుని 'ఏఏ' గ్రేడ్ను సైతం సంపాదించారు. అయితే ఆర్థికరంగ సంస్థ గ్రేడ్ ఇచ్చినా బ్యాంకు రుణం తీసుకుంటే కచ్ఛితంగా ఆస్తులు తాకట్టు పెట్టాల్సి వస్తుందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఆస్తులను తాకట్టు పెట్టి రుణం తీసుకున్న విషయం విధితమే. బ్యాంకుల నుంచి జీహెచ్ఎంసీ తీసుకోవాలనుకుంటున్న రూ.2,500 కోట్ల కోసం ఆస్తులను తాకట్టు పెట్టక తప్పదు.
సర్కార్ కౌంటర్ గ్యారంటీ : జనార్దన్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్
బల్దియా గతంలో ఎప్పుడూ బ్యాంకుల నుంచి రుణం తీసుకోలేదు. ఈసారి తీసుకోవాలని అనుకున్నాం. అనుమతి కోసం సర్కార్కు లేఖరాశాం. ప్రభుత్వమే కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది. బాండ్ల ద్వారా రూ.1000 కోట్లు సేకరిస్తాం. దేశంలో బాండ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
అప్పు తీసుకోవడం శోచనీయం : ఎం.శ్రీనివాస్,
సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి
బల్దియాను దివాళా తీయించిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకు దక్కింది. ధనిక రాష్ట్రంలో జీహెచ్ఎంసీ అప్పులు తీసుకోవాలనడం శోచనీయం. ఇదీ స్థానిక సంస్థల నాశనానికి పరాకాష్ట. ఈ విషయంపై నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు స్పందించాలి.