Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరునెలలుగా వేతనాలు బంద్
- రూ. 31.01 కోట్ల మేర నిలిపివేత
- అమలుకాని పెంపు జీవో
- జీఎస్టీతో వాత
- ఒక్కో శాఖలో ఒక్కో తీరు
- పట్టించుకోని వర్క్ఏజెన్సీలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టులో ఫీల్డ్స్టాఫ్గా పనిచేస్తున్న వర్క్ఇన్స్స్పె క్టర్లు అష్టకష్టాలు పడుతున్నారు. ఆరునెలలుగా వేతనాలు అందక ఆందోళన చెందుతున్నారు. వర్క్ఏజెన్సీలు వర్క్ఇన్స్స్పెక్టర్లకు జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.కాగా ఒకవైపు భగీరథ కాంట్రాక్టర్లకు బిల్లులు వెనువెంటనే చెల్లిస్తున్నామని, త్వరితగతిన పూర్తిచేసిన వారికి 20 శాతం అదనంగా ఇన్సెంటీవ్ కూడా ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నది. మరోవైపు అసలు ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అయిన వర్క్ఇన్స్స్పెక్టర్లు జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. దాదాపు రెండేండ్ల క్రితం మిషన్ భగీరథకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా జీవో నెంబరు 26 ద్వారా 47 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 662 మంది వర్క్ ఇన్స్స్పెక్టర్లను నియమించింది. ఏడాదిపాటు సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించింది. ఇటీవల మళ్లీ జీవో 444 ద్వారా వారి సర్వీసులను పునరుద్ధరించింది. రాష్ట్రంలోని ఉమ్మడి 10జిల్లాల వారీగా 662 వర్క్ ఇన్స్స్పెక్టర్ పోస్టులను భర్తీచేయడానికి స్థానిక ఏజెన్సీలకు అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, డ్రాయిం గ్ల ప్రకారం భగీరథ ట్యాంకులు, పైపులైన్ పనులు చేయిం చడం వీరి విధి. ప్రతిరోజూ ఫీల్డ్లో తనిఖీలు నిర్వహించడం, రికార్డులు అప్డేట్ ఏయడం, ఫోటోలు తీయడం వెబ్ సైట్లో అప్లోడ్ చేయడం, ఉన్నతాధికారులకు పంపడం తదితర పనులు చేయాల్సి ఉంటుంది. ఆయా వర్క్ఏజెన్సీ ల ద్వారా వారంతా రిక్రూట్ అయ్యారు. తొలుత అందరికి పర్మినెంట్ చేస్తామని చెప్పారు. ఆనక పీఎఫ్, ఈఎస్ఐ వసతి కల్పించారు. ఇప్పటివరకు రెగ్యులరైజ్ కాకపోగా, వేతనాలు సైతం నెలాఖరుకు ఇవ్వడం లేదని వర్క్ఇన్స్స్పెక్టర్లు వాపోతున్నారు. ఒక్కోక్కరికి ప్రతినెలా రోజుకు రూ.735 చొప్పున 25 రోజులకు రూ.18,375 ఇస్తున్నారు. దాదాపు 662 మందికిగాను గత మార్చి నుంచి వేతనాలు బకాయిలుగా ఉన్నాయి. కొత్త ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఒక్కొక్కరికి రూ.960 చొప్పున 25 రోజులకుగాను ప్రతినెలా ఇవ్వాలి. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జీవో ప్రకారం 50 శాతం అదనంగా పెంచారు. ఈ మూడు రకాలుగా వర్క్ఇన్స్స్పెక్టర్లకు రూ.31.01 కోట్లు అందాల్సి ఉంది. ఇవి బకాయిలా పేరుకుపోయాయి. అంతేగాక వేతనాల్లో ఏజెన్సీలకు మరో మూడు శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలావుంటే జీతాలు ఆలస్యం మూలంగా జీఎస్టీ జరిమానా కూడా ఉద్యోగులపైనే పడుతున్నది. ప్రతినెలా కట్టాల్సిన పన్ను కాస్త తడిసిమోపెడు అయ్యే పరిస్థితి ఉంది. వేతనాలకు కోత పడే అవకాశం ఏర్పడింది.
పాత వేతనాలే
ప్రస్తుతం భగీరథ ప్రాజెక్టులో అమలవుతున్న రేట్లు సైతం పాత 2014-15 షెడ్యూల్డ్ స్టాండర్డ్ రేట్లు(ఎస్ఎస్ఆర్)ప్రకారమే. 2017-18లో వచ్చిన ఎస్ఎస్ఆర్ రేట్లు చెల్లించడం లేదు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలు ఇచ్చినా ఇటు ఎజెన్సీలు పట్టించుకోవడం లేదు. అటు ప్రభుత్వం పర్యవేక్షించడం లేదు. 2014-15 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం వర్క్ఇన్స్స్పెక్టర్లకు రోజుకు రూ. 730 చొప్పున 25 రోజులు చెల్లించాలి. అదే 2016-17 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రోజుకు రూ. 930 చొప్పున 25 రోజులు ఇవ్వాలి. బిటెక్ డిగ్రీ ఉంటే రూ.18,375, డిప్లొమో ఉంటే రూ.13,750 మేరకు చెల్లిస్తారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవో 14ను ఏజెన్సీలు అమలుచేయడం లేదు.
కార్పొరేషన్లల్లో మరో లెక్క
వర్క్ఇన్స్స్పెక్టర్లు ప్రభుత్వ శాఖల్లోనూ వివక్ష ఎదురవుతున్నది. ఒక్కో శాఖలో ఒక్కో తీరున వేతనాలను నిర్ణయించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ ఇండిస్టీరియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఐఐసీ)లోనూ పనిచేస్తున్న వేలాది మంది వర్క్ఇన్స్ ఫెక్టర్లకు పెంపును కలుపుకుని ప్రస్తుతం నెలకు రూ. 34,750 చెల్లిస్తున్నారు. భగీరథ వర్క్ఇన్స్స్పెక్టర్లకు ఇంకా ఈ జీవోను అమలు చేయడం లేదు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగు లు సేవలు అందిస్తున్న వారికి జీవో నెం బరు 14 ద్వారా వేతనాలు పెంచుతూ 2016, ఫిబ్రవరిలో ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికి ఆ జీవో ను అమలుచేయకుండా పెండింగ్లో పెట్టారు. దీంతో కుటుంబాలను సైతం పోషించుకోలేని దుస్థితి ఏర్పడిందని పేరు రాయడానికి ఇష్టపడని ఓ వర్క్ఇన్స్స్పెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
జీఎస్టీతో జీతాలకు వాత
ప్రతినెలా సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడంతో పలు రకాలు సమస్యలు తలెత్తుతున్నాయి. వర్క్ఇన్స్స్పెక్టర్ల లెక్కల ప్రకారం మూడు రకాలుగా వేతనాలు రూ.31.01 కోట్లు రావాల్సి ఉంది. బకాయిలు పేరుకుపోయాయి. గతంలో ఉన్న సర్వీసు ట్యాక్స్ 14.5 శాతం నుంచి 18 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. ఆలస్యం కావడంతో మరో 10 శాతం జరిమానా కింద అదనంగా కట్టాల్సి ఉంటుందని సమాచారం. మొత్తం రూ. 31.01 కోట్లకు వర్స్ ఇన్స్ స్పెక్టర్లకు వేతనాలు రావాలి. జీఎస్టీ జరిమానా పన్ను దా దాపు 10 శాతం, వర్క్ ఏజెన్సీ కమిషన్ మరో మూడు శాతం సొమ్ము అంతా కలిపి రూ.5.96 కోట్లు అవుతుందని వర్క్ఇన్స్స్పెక్టర్లు అంటున్నారు. ఇది పోగా మిగిలిన రూ.25.04 కోట్లు వేతనాల కింద చెల్లించాల్సి ఉంంది. దీనిపై పేరు రాయడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారిని వివరణ కోరగా 'ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాలేదని, రాగానే వర్క్ఇన్స్స్పెక్టర్లకు వేతనాలు చెల్లిస్తామని' చెప్పారు.