Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలతో ముడివేసుకుని ప్రజల జీవితాలతో మమేకమైన పూల పండుగ బతుకమ్మ సంబురాలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎంగిలిపూల బతుకమ్మతో మోదలైన పండుగ 28న సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఆరోజున ట్యాంక్బండ్పై 40వేల మంది మహిళలతో ఘనంగా బతుకమ్మ ముగింపు ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
బతుకమ్మ పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. వేడుకలకు నిధులు కూడా విడుదల చేసింది. హైదరాబాద్లోని బతుకమ్మ ఘాట్ను జీహెచ్ఎంసీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. పండుగ ఏర్పాట్లపై బుధవారం కూడా సీఎస్ జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఈ నెల 26న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో, 28న ట్యాంక్బండ్పై సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి.
మంత్రుల నివాసాల్లో వేడుకలు
బంజారాహిల్స్లోని మంత్రుల నివాసాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమునా రాజేందర్ ఇండ్ల వద్ద ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. సచివాలయం, డీజీపీ ఆఫీస్తో పాటు జిల్లా కలక్టరేట్లు, ఇతర కార్యాలయాల్లో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.