Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీతాల కోసం డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుల ఎదురుచూపు
- నాలుగు నెలలుగా వేతనాల్లేక అవస్థ
- ఉద్యోగులకు 25నే చెల్లిస్తున్న ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు వేతనాల్లేక నానా అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. జూన్ నుంచి జీతాలివ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 'తెలంగాణలో పెద్ద పండగ అయినా దసరాకైనా మాపై దయచూపండి' అని ముఖ్యమంత్రి కేసీఆర్ను వేడుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల 25నే జీతాలిచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారు. అందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ జీవో సైతం విడుదల చేసింది. కానీ డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకులకు మాత్రం నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదు. వారి జీతాలు రూ.31,050 నుంచి రూ.40,270కు పెరిగాయన్న సంతోషం మాత్రమే మిగిలింది. ఇంతవరకూ పెరిగిన జీతాలు అందుకోలేని దుస్థితిలో వారున్నారు. దసరా పండగ వస్తున్నందున జీతాలు రాకపోవడంతో వారు మానసిక వేదనలో ఉన్నారు. 126 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 926 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్న విషయం తెలిసిందే. 2017-18 విద్యాసంవత్సరం జూన్లో ప్రారంభమైంది. మొదటి త్రైమాసికం కూడా ముగిసింది. అయినా డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకులకు జీతాలు అందలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతున్నది.
అందుబాటులో లేని కమిషనర్
కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ (సీసీఈ) ఎ వాణీప్రసాద్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా బిజీబిజీగా ఉంటున్నారు. రెగ్యులర్ సీసీఈ అందుబాటులో లేకపోవడంతో ఉన్నత, సాంకేతిక విద్యలో అనేక సమస్యలు నెలకొన్నాయని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీఈ లేనందు వల్లే జీతాలు సకాలంలో రావడం లేదని కాంట్రాక్టు అధ్యాపకులు చెప్తున్నారు. రెగ్యులర్ సీసీఈ ఉంటే పరిపాలన, అకడమిక్ అంశాలతోపాటు అధ్యాపకుల జీతభత్యాలు, బోధన వంటి అంశాలపైనా దృష్టి సారించే అవకాశముంటుంది. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్స్ నుంచి ప్రతినెలా కాంట్రాక్టు అధ్యాపకుల వివరాలు తెప్పించుకొని జీతాలు ఇచ్చేందుకు అవకాశముండేది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఇటీవలే పెరిగిన జీతాలు అందాయి. ఇంటర్ విద్యాశాఖకు కమిషనర్ అందుబాటులో ఉండడంతో ఇది సాధ్యమైందని డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకులు అంటున్నారు.
జీతాల్లేకుండా ఎలా బతకాలి : రమణారెడ్డి
దసరా పండగ వస్తున్నా జీతాలివ్వలేదని ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి రమణారెడ్డి నవతెలంగాణతో ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ నుంచి జీతాల్లేకుండా ఎలా బతకాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పండగకు ముందే ఇస్తున్నట్టుగా తమకూ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ప్రిన్సిపాల్స్ నుంచి వివరాలు అందాయని, వెంటనే పరిశీలించిన సీసీఈ ప్రొసీడింగ్స్ విడుదల చేయాలని చెప్పారు.