Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దసరా సెలవులు, పండుగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య నడిపించే ప్రత్యేక రైళ్లకు అదనపు చార్జీలు వసూలు చేస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. టిక్కెట్లపై అదనపు రుసుము వసూలు చేయడంతో పాటు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్పామ్ టిక్కెట్ల ధరలను పెంచామని ప్రకటించడంతో ప్రయాణికులు మండిపడు తున్నారు. ప్రత్యేక రైళ్ల సంగతి అటుంచితే ప్రతి రోజూ తిరిగే సాధారణ రైళ్లల్లోలోనూ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక రైళ్లంటూ ప్రకటిస్తున్న రైల్వే ప్యాసింజర్ రైళ్లకు డొక్కు బోగీలు తగిలించి నడిపిస్తూ వాటిలో ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తోందని, అడ్వాన్స్ టిక్కెట్ల కోసం స్టేషన్లకు వచ్చే ప్రయాణికులు అదనపు చార్జీలు వడ్డిస్తుండటంతో ప్రయాణీకులు కౌంటర్లలోని సిబ్బందితో గొడవలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేసినా నోరుమెదపరు, ప్రజల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నాము, కాస్త అదనపు చార్జీలు వసూలు చేస్తే ఇంత లొల్లిచేస్తారా అంటూ వారు ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు విమర్శలున్నాయి. అయితే దసరాకు ఎన్ని ప్రత్యేక రైళ్లు నడిపించనుందో స్పష్టమైన ప్రకటన చేయకుండానే రైల్వే సిబ్బంది ఎడాపెడా టిక్కెట్ల విక్రయాలు జరుపుతోంది. దక్షణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్ల పరిధిల్లోని వివిధ ఆయా మేజర్ స్టేషన్ల నుంచి వేసవి, దసరా, దీపావళి, సంక్రాంతి సెలవులు, పండుగల నేపథ్యంలో ప్రతి ఏటా ప్రత్యేక రైళ్లు నడుపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేందుకు తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కోల్కతా, తమిళనాడు తదితర రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్లో స్థిరపడ్డ విషయం తెలిసిందే. అయితే వీరు పండుగలు, పిల్లలకు సెలవులు దొరికినప్పుడు కుటుంబ సమేతంగా స్వగ్రామాలకు వెళుతుంటారు. ఆయా సందర్భాలను బట్టి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ద.మరైల్వే ప్రత్యేక రైళ్లు నడిపిస్తుంటాయి. ఈ సారి ముందుగానే స్పందించిన ద.మరైల్వే దసరా సెలవులు, పండుగ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ రిజర్వేషన్లు చేయించుకోవచ్చని ద.మరైల్వే అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. దీంతో వారు హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్తో పాటు ప్రయివేటు ఏజెంట్ల వద్ద క్యూ కట్టారు. రైల్వే కౌంటర్లలో దూరాన్ని బట్టి యాభై నుంచి 70 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తుండగా ప్రయివేటు ఏజెంట్లు ప్రయాణికుల డిమాండ్ను బట్టి దండుకుంటున్నారు.. ఇదిలావుండగా ప్రయాణికుల రద్దీని బట్టి బ్రోకర్లు రైల్వే బుకింగ్ కౌంటర్ల వద్ద తిష్టవేస్తున్నారు. వారిని మాటల్లో పెడుతూ టిక్కెట్లు తెచ్చిపెడతామని రెండింతలు వసూలు చేస్తున్నారు. ఈ విషయం రైల్వే ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. క్యూలైన్లో గంటల తరబడి నిలబడినప్పటికీ ప్రయాణికులకు టిక్కెట్లు దొరకడంలేదు కానీ బ్రోకర్లను ఆశ్రయిస్తున్న వారికి క్షణాల్లో టిక్కెట్లు దొరకడంతో పాటు బెర్త్లూ కన్ఫర్మ్ అవుతున్నాయి. దసరా సెలవులు, ఈనెల 30న దసరా పండుగను పురస్కరించుకుని రైల్వే శాఖ ఈనెల 20 నుంచే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది. దసరా మొదలుకుని అక్టోబర్ 18న దీపావళి పండుగ వరకు దక్షిణ మధ్య రైల్వే సాధారణతో రైళ్లతో పాటు వందకు పైగా ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. సెలవులు, పండగల సమయాల్లో ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసి ఉంటాయి కాబట్టి రైల్వే అధికారులు కేవలం సికింద్రాబాద్ స్టేషన్పై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. మంచినీరు, చెత్తాచెదారంలేకుండా పరిశుభ్రంగా ఉంచుతున్నారు కానీ మిగితా స్టేషన్ల పై అంతగా పట్టించుకోవడంలేదన్న ప్రయాణికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పండుగలు, సెలవుల సమయాల్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం రైల్వే శాఖలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఏయే రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందో అధికారులతో అడిగితెలుసుకుని ఆయా మార్గాల్లో ఎన్నెన్ని రైళ్లు నడిపించాలి, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏర్పాట్లను ముందస్తుగానే చేయిస్తూ ఉంటారు. అంతే కాకుండా ట్రాఫిక్, సిగలింగ్, ఇంజనీరింగ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా జీఎం వినోద్ కుమార్ యాదవ్ ముందస్తుగానే స్పందించి అధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లపై సమీక్షించారు. అడ్వాన్స్ రిజర్వేషన్లు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా స్పాట్ టిక్కెట్ కౌంటర్లు పెంచడం, భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్తో పాటు తెలుగు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రయాణికులకు భద్రతకు సహకరించాలని కోరారు.