Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్వాస ఉన్నంత వరకూ చిన్నారుల కోసమే : నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి
నవతెలంగాణ-జోగులాంబ/మహబూబ్నగర్
దేశవ్యాప్తంగా ఉన్న కడు పేదరికమే బాలల హక్కులను హరిస్తోందని నోబెల్ శాంతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. తన శ్వాస ఉన్నంత వరకూ బాలల హక్కుల కోసమే పని చేస్తానని చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేపట్టిన భారత్ దర్శన్ యాత్ర బుధవారం జోగులాంబ గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల్లో సాగింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే డీకే అరుణ, కలెక్టర్ రజత్కుమార్సైనీ, ఎస్పీ విజరుకుమార్ ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి సత్యార్థి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్యారడైజ్ ఫంక్షన్హాల్ వరకూ సాగింది. మహబూబ్నగర్ జిల్లాలో జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాల వరకూ ర్యాలీ నిర్వహించారు. అక్కడ జేపీఎన్సీ కళాశాల చైర్మన్ రవికుమార్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఆయా సభల్లో సత్యార్థి మాట్లాడుతూ.. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయస్సులో పిల్లలచే అనేక చోట్ల పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడైనా పంట పొలాల్లో బాలలు పని చేయడం చూస్తే మనస్సు కలిచివేస్తుందన్నారు. పట్టణ, మున్సిపాలిటీ ప్రాంతాల్లో పొట్టనింపుకోవడం కోసం చిన్నారులు భుజాలకు సంచులు వేసుకొని కాగితాలు ఏరుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భావి భారత పౌరులుగా తయారు కావాల్సిన బాల్యం బాల కార్మికులుగానే మిగిలిపోతున్నారన్నారు. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే బాల్యంలోనే వృద్ధప్య ఛాయలు వస్తాయన్నారు. గ్రామాల్లో గిరిజనులు, దళిత కుటుంబాలు దూర ప్రాంతాలకు వలస వెళ్తూ ఇంటి వద్ద ఉన్న ముసలివాళ్లకు తిండిపెట్టే మనుషులుగా బాలల్ని ఉంచుతున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా పేదరిక నిర్మూలన అయిన రోజే బాల కార్మికులకు సంకెళ్లు తెగిపోతాయని చెప్పారు. దీని కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాలల హక్కులపై ప్రచారం చేస్తూ సెప్టెంబర్ 11న కన్యాకుమారిలో యాత్ర ప్రారంభించినట్టు తెలిపారు. అన్ని రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగుతూ 11వేల కిలో మీటర్లను డిసెంబర్ 16న పూర్తి చేసుకొని ఢిల్లీలో ముగుస్తుందన్నారు. మేథావులు, స్వచ్ఛంద సంస్థలు, యువత బాలల హక్కులపై ప్రభుత్వాలకు తెలిసొచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. జోగులాంబలో నిర్వహించిన కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య, మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి, మాజీ ఎంపీ మందజగన్నాథం, వైస్ చైర్మన్ శంకర్ పాల్గొన్నారు. మహబూబ్నగర్లో విఠల్రావు ఆర్య, విశాల్రావు ఆర్య, మోహన్బాబు తదితరులు పాల్గొన్నారు.