Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నూల్ ఎంపీ టీజీపై పోలీసులకు ఫిర్యాదు
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
'కోమటోళ్లు సామాజిక స్మగ్లరు' పుస్తకం రాసిన తనను ఉరితీయాలని ఎంపీ టిజి వెంకటేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రముఖ మేధావి, విశ్రాంత అధ్యాపకులు కంచ ఐలయ్య ఖండించారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలోని పీఎస్లో టీజీ వెంకటేష్పై టీమాస్ ఫోరం, ఓయూ విద్యార్థి సంఘాలతో కలిసి బుధవారం ఆయన సీఐ అశోక్రెడ్డికి ఫిర్యాదు చేశారు.అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తాను రాసిన పుస్తకాన్ని కనీసం చదవకుండా తనను హత్యచేస్తానని నడిరోడ్డుపై టీజీ వెంకటేష్ బహిరంగంగా చెప్పడం భారీ తెగింపునకు నిదర్శనమన్నారు. తనపై టీజీ వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం కనీసం స్పందించలేదన్నారు. సీఎం కేసీఆర్, టీజీ వెంకటేష్ పరస్పర అవగాహనతో చేసిన ప్రకటన ఇదని ఐలయ్య ఆరోపించారు. తనను హత్యచేస్తానన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పైగా తనకు వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాలల్లో టీఆర్ఎస్ నేతలు పాల్గొనడం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 'దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థను రాచరికంలోకి తీసుకుపోవాలి. బ్యాంకులు సైతం ఉండొద్దు' అని మాట్లాడే టీజీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. వెంకటేష్ను ఎంపీగా కొనసాగించే విషయాన్ని ప్రధానికి, అరెస్టు విషయం పోలీసులకు వదిలిపెడుతున్నట్టు ఐలయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో టీమాస్ ఫోరం నేతలు జి.రాములు, జాన్వెస్లీ, పి.ఆశయ్య, సహదేవ్, జమాలుద్దీన్ఖాన్, స్కైలాబ్బాబు, ఓయూ విద్యార్థి నేతలు రామయ్య, శ్రీరాంనాయక్, రవీందర్, రఘు, దశరథ్, ఆర్ఎల్.మూర్తి, నరేష్, సుదర్శన్, శరత్, మల్లేస్, కరణ్ పాల్గొన్నారు.