Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా
- రైతుల ఆత్మగోసే కేసీఆర్కు ఉరితాడు : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి
నవతెలంగాణ-మహబూబ్నగర్/వికారాబాద్
దేశంలో పీఎం మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్లను మించిన అబద్దాల కోరులు లేరని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా అన్నారు. ఇందిరమ్మ రైతుబాటలో భాగంగా బుధవారం మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లా పరిగిలో కార్యకర్తల అవగాహనా సదస్సులు నిర్వహించారు. పరిగి సభలో కుంతియా మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ''తెలంగాణలో కేసీఆర్ కో హఠాయింగే.. కాంగ్రెస్కో లేకే ఆయింగే'' నినాదంతో ప్రసంగాన్ని ముగించారు.
రెండు సభల్లోనూ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 3,600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతుల ఆత్మగోసే సీఎం కేసీఆర్కు ఉరితాడు అవుతుందని అన్నారు. మిషన్ కాకతీయ, భగీరథల్లో కేసీఆర్ ఆరు శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. మూడేండ్లుగా రైతుల గురించి పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రైతు జపం చేస్తున్నారని విమర్శించారు.
రైతు సమన్వయ కమిటీల్లో కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే చోటు కల్పించడం దుర్మార్గమన్నారు. భూమి దున్నే ప్రతి రైతుకూ రూ.నాలుగు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో 10 లక్షల ఎకరాల భూమి దళితులు, గిరిజనులకు పంచామని చెప్పారు. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాలు ఎగుర వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొత్త ప్రాజెక్టుల పేరుతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిలిపేశారని, దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రంగారెడ్డి జిల్లాకు మళ్లీ చేవెళ్ల-ప్రాణహిత ద్వారా నీరందిస్తామన్నారు. ఇందిరమ్మ రైతుబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలు చేపడుతామని చెప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. తాము రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, లక్ష ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులకు రూ.3వేల భృతి చెల్లిస్తామని హామీనిచ్చారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసమే ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందన్నారు. దేశ్ముఖ్లు, జమీందారులు, నైజాం పాలనకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన ప్రతి పేదవాడూ ఆయుధంగా మారి పోరాటం చేశారని గుర్తు చేశారు. నాడు శిస్తు కట్టలేదని జమీందార్లు భూమి లాక్కుంటే, నేడు కేసీఆర్ పట్టా కాగితంలో పేరు లేదని భూమి లాక్కునే కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డుల విచారణ పేరుతో పేదలను భూమి నుంచి వెళ్లగొట్టే కుట్రలు చేస్తున్నారని అన్నారు. మహబూబ్నగర్ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు డీకె.అరుణ, సంపత్కుమార్, చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, పరిగిలో ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి పాల్గొన్నారు.