Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వయస్సు, అందాన్ని బట్టి రేటు
- ఒక్కో పెండ్లికి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలు
- 8 మంది అరబ్ షేక్లతోపాటు మరో 12 మంది అరెస్ట్
- ముంబయి ఖాజీలతో చేతులు...పాతబస్తీ అడ్డాగా తతంగం
- మాయమాటలతో మైనర్లకు నిఖా
నవతెలంగాణ - సిటీబ్యూరో
బ్రోకర్లకు డబ్బులు ఎరచూపి మైనర్లతో కాంట్రాక్ట్ పెండ్లి ఒప్పందాలు... వృద్ధ షేక్లకు 15 ఏండ్ల మైనర్లతో నిఖాలు..ఆపై లాడ్జీల్లో మైనర్లతో 15-20 రోజులపాటు షేక్ల విలాసాలు...ఆ తర్వాత విజిటింగ్ వీసాలపై ఒమన్, ఖతార్కు తీసుకెళ్లడం...అక్కడా లైంగిక వేధింపులకు గురిచేయడం...ఆ తర్వాత వేరే వారికి అమ్మేయడం లేదా వదిలిపెట్టడం...ఇదీ హైదరాబాద్లో జరుగుతున్న కాంట్రాక్టు పెండ్లీల తతంగం. హైదరాబాద్లోని పాతబస్తీ కేంద్రంగా పెండ్లీల పేరుతో మైనర్ల జీవితాలతో ఆటలాడుకుంటున్న వారిపైనా, అక్రమ వివాహాలపైనా పోలీసులు నిఘాపెట్టి ఎనిమిది షేక్లను, ముగ్గురు ఖాజీలను, ఐదుగురు బ్రోకర్లను, నలుగురు హోటల్ యజమానులను బుధవారం అరెస్టు చేశారు. 12 మంది అమ్మాయిలకు షేక్ల నుంచి విముక్తి కల్పించారు. హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణతో కలిసి నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి కాంట్రాక్టు పెండ్లీల గురించి వివరించారు.
గతంలో పాతబస్తీలో కాంట్రాక్టు పెండ్లీలు చేసుకొని ఒమన్, ఖతార్కు వెళ్లిన వారు బ్రోకర్లుగా మారారు. పాతబస్తీవాళ్లతో వారు చేతులు కలిపారు. 15 మందికిపైగా బ్రోకర్లు షేక్లను ఇండియాకు పంపిస్తున్నారు. ఒప్పందం ప్రకారం షేక్లు విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి పెండ్లి చేసేవరకు స్థానికంగా ఉన్న బ్రోకర్లు వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, తదితర ప్రాంతాల్లోని లాడ్జీలు, సాధారణ, స్టార్ హోటళ్లలో షేక్లను ఉంచుతున్నారు. సౌత్జోన్కు చెందిన బ్రోకర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ముస్లిం కుటుంబాలను ఎంచుకుంటున్నారు. 'షేక్తో పెండ్లి జరిగితే ఆర్థికంగా స్థిరపడతారు' అని నమ్మిస్తున్నారు. అందమైన అమ్మాయిలను షేక్ల వద్దకు తీసుకెళ్తున్నారు. షేక్ నచ్చిన అమ్మాయితో రెండురోజుల్లో (ఖాజీ సమక్షంలో నిఖా) కాంట్రాక్ట్ పెండ్లి చేస్తున్నారు. దీనికిగానూ షేక్ నుంచి ఒక్కో అమ్మాయికి అందాన్ని, వయస్సును బట్టి రూ.3 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులకు మాత్రం రూ. 40 వేల నుంచి లక్ష రూపాయలే ఇస్తున్నారు. ఇదే పద్ధతిలో కొన్ని నెలల కింద పాతబస్తీకి చెందిన రుక్సానా అనే అమ్మాయిని ఒమన్ షేక్ కాంట్రాక్టు పెండ్లి చేసుకున్నాడు. దీనికి ముంబాయికి చెందిన చీఫ్ ఖాజీ ఫరీద్ హైమద్ఖాన్ సహకరించాడు. పెండ్లి తర్వాత షేక్ అమ్మాయిని విజిటింగ్ వీసాపై ఒమన్ తీసుకెళ్లాడు. అక్కడ చిత్రహింసలకు గురిచేశాడు. ఆ తర్వాత ఇతర షేక్లకు అప్పగించాడు. వారూ లైంగిక వేధింపులకు గురిచేశారు. ఈ మోసంపై ఆగస్టు 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కాంట్రాక్టు పెండ్లీలపై నిఘాపెట్టి ఒమన్, ఖతార్ దేశాలకు చెందిన ఏఎం.హబీబ్ అలీ ఇస్సా, ఏఎస్.తాలీబ్ హమీద్ అలీ, ఏయూ జుమా శినూన్ సులేమాన్, ఏఎస్.నసార్ ఖలీఫా హైమద్, క్యూస్మీ హుస్సేన్, ఒమర్, హైమద్ జబ్బార్, సఫిలోద్దీన్లను, ముగ్గురు ఖాజీలను, ఐదుగురు బ్రోకర్లను, నలుగురు హోటల్ యజమానులను అరెస్టు చేశారు. షేక్ల నుంచి 12 మంది బాధితులను రక్షించారు. ఈ కేసులో మొత్తం 35 మంది బ్రోకర్లను గుర్తించగా, అందులో 25 మంది వరకు మహిళా బ్రోకర్లున్నారు. మిగిలిన బ్రోకర్లపై ప్రత్యేక నిఘా పెట్టి జియోట్యాగింగ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేశారు. మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది. ముఠా గుట్టురట్టు చేసేందుకు సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఎంతో కష్టపడ్డాయని సీపీ మహేందర్రెడ్డి తెలిపారు. పోలీసులను ఆయన అభినందించారు.