Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళేశ్వరం 10వ ప్యాకేజీ పనుల్లో ఘోర ప్రమాదం
- పైకప్పు కూలి ఏడుగురు మృతి
- శిథిలాల కింద నుజ్జునుజ్జయిన దేహాలు
- రూ.5లక్షల ఎక్స్గ్రేషియా : ఈఈ ఆనంద్
- గోప్యంగా పోస్టుమార్టమా? : ఎమ్మెల్యే జీవన్రెడ్డి
- కుటుంబానికి రూ.25లక్షలివ్వాలి : సీపీఐ(ఎం)
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనుల్లో వలస జీవుల బతుకులు ఛిద్రమయ్యాయి. 10వ ప్యాకేజీ పనుల్లో సొరంగం పైకప్పు కూలి ఏడుగురు కూలీలు మృతిచెందారు. మృతదేహాలు శిథిలాల కింద నుజ్జునుజ్జయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పొట్టకూటి కోసం రాష్ట్రం దాటి వచ్చిన వలస కార్మికులు బతుకులు సొరంగంలో సమాధయ్యాయి. ఈ హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగింది.
నవతెలంగాణ- ఇల్లంతకుంట / సిరిసిల్ల / తంగళ్లపల్లి / కరీంనగర్టౌన్
మధ్య మానేరు నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు నీటి తరలింపు కోసం 10వ ప్యాకేజీ కింద 7.651కిలోమీటర్ల మేర సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. మరో రెండు రోజుల్లో మిగిలిన 800మీటర్ల దూరాన్ని పూర్తి చేయనున్నారు. కొన్ని రోజులుగా ఎయిర్బ్లాస్ట్లు ఏర్పాటు చేసి సొరంగంలో బండరాళ్లను పగలగొడుతున్నారు. అందులో భాగంగానే బుధవారం ఉదయం 27 మంది గ్రూపులుగా సొరంగంలోకి వెళ్లారు. ఎయిర్బ్లాస్ట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సొరంగం పైకప్పు నుంచి భారీ పెచ్చులు, బండరాళ్లు ఊడిపడ్డాయి. అక్కడే పని చేస్తున్న 8 మందిలో ఆరుగురు శిథిలాల కింద నుజ్జునుజ్జయ్యారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పక్కనే పని చేస్తున్న కార్మికులు, పర్యవేక్షిస్తున్న అధికారులు వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే మరో కార్మికుడు మృతిచెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్పీ విశ్వజిత్కాంపాటి, కలెక్టర్ కృష్ణభాస్కర్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. తమ సిబ్బందితో కలిసి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీయించారు. డీఐజీ రవివర్మ సైతం ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదతీరుని అధికారులను అడిగి తెలు సుకున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొ క్కరికి రూ.5లక్షల పరిహారం అంది స్తామ ని సొరంగమార్గం ప్రాజెక్టు ఈఈ ఆనంద్ ప్రకటించారు. ప్రభుత్వపరంగా కార్మికులను ఆదుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.మృతుల్లో జితేందర్కుమార్ (బర్వాదా జిల్లా పశ్చిమ బెంగాల్), రామకృష్ణసాహు (పుడమర్రి, తలాపూర్ తాలూకా, గజం జిల్లా ఒరిస్సా), బందన్సరేన్ (రాయిపహాడి, ముస్తాబాని పోస్టు, ఈస్ట్సింగోహం జిల్లా జార్ఖండ్), హికిమ్హన్సిదా (జమ్దా గ్రామం, ఈస్ట్సింగోహం జిల్లా జార్ఖండ్), హరిచంద నేతన్ (సౌత్పురా గ్రామం, బర్తర్జిల్లా ఛత్తీస్గఢ్), కురన్సింగ్ (బర్లంగ, రామఘడ్ జిల్లా, జార్ఖండ్), సందీప్ (వరంగల్ జిల్లా, ములుగు) ఉన్నారు. తీవ్ర గాయాలైన జత్నాహోత్నా (రామ్జోలే, సిమ్డేగా జిల్లా, జార్ఖండ్) పరిస్థితి విషమంగా ఉంది.
నిర్లక్ష్యమే కారణమా..
ప్రమాదం జరిగిన తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. టన్నెల్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో ఎయిర్బ్లాస్టింగ్ నిర్వహిస్తారు. బుధవారం ఎయిర్బ్లాస్టింగ్ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు విమర్శలున్నాయి. అధికారులేమో తాము మధ్యాహ్నం 2గంటల తరువాతే బ్లాస్టింగ్ నిర్వహిస్తామని, ప్రమాదం మాత్రం 12.30 సమయంలో జరిగిందని చెప్పడం పట్ల అనుమానాలకు తావిస్తోంది. పనులు జరుగుతున్న సందర్భంలో కనీస పర్యవేక్షణ లేదని స్థానిక కార్మికులు చెబుతున్నారు. కేంద్ర ప్రత్యేక బృందం మంగళవారం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన మరుసటిరోజే ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రమాదానికి సంబంధించి ప్రాజెక్టు నిర్వాహకులు స్పష్టమైన సమాధానం చెప్పకపోవడం కూడా ఘటనకు నిర్లక్ష్యమే కారణమనేదానికి బలం చేకూరుస్తోంది. పనుల కాంట్రాక్టును హెచ్సీసీ-మెగా-బీహెచ్ఈఎల్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీలో ఎక్కువ పనిని ప్రతిమా ఇన్ఫ్రా చేస్తోంది.
కరీంనగర్ ఆస్పత్రిలో విపక్షాల సందర్శన
కరీంనగర్ ఆస్పత్రికి మృతదేహాలను తరలించగానే, 7స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహా పలువురు నేతలు వచ్చారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండారి శేఖర్, రైతు సంఘం నాయకులు వర్ణవెంకట్రెడ్డి ఆస్పత్రిని సందర్శించారు. మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస పర్యవేక్షణ లేకుండా, జాగ్రత్తలు తీసుకుండా పనులు చేయడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ప్రమాదానికి గల కారణాలు తెలపకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
బంధువులకు చెప్పకుండానే పోస్టుమార్గమా..?
కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత జీవన్రెడ్డి
మృతులంతా ఇతర రాష్ట్రాల కార్మికులే. వారి వివరాలు చెప్పకుండా, బంధువులకు సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టం ఎలా నిర్వాహిస్తారు. కనీసం ఘటనకు దారిన తీసిన కారణాలూ వెల్లడించకపోవడం దారుణం. రోడ్డున పడిన మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేయాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి
నిర్లక్షంగా పనులు చేయిస్తూ ఏడుగురు మృతికి కారణమైన కంపెనీ కాంట్రాక్ట్ను రద్దు చేయాలి. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలి. ఘటనకు గల కారణాలు వెల్లడించాలి.