Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్తులోనూ అనుమతులు రాకపోతే ఎలా? : తెలంగాణను ప్రశ్నించిన ఎన్జీటీ..
- పక్క రాష్ట్రాలకు తాగునీరిస్తామన్న ప్రభుత్వ న్యాయవాది
- మూడు వేలకు పైగా అటవీ భూమి వినియోగం : పిటిషనర్ న్యాయవాది
- అటవీభూమిపై అఫిడవిట్ సమర్పించండి: ధర్మాసనం అక్టోబర్ 3కు వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాథమికంగా సాగునీటి ప్రాజెక్టు అని జాతీయ హరిత ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. నీటిని ప్రత్యామ్నాయంగా మాత్రమే తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారని, ఈ ప్రాజెక్టు ప్రాథమికంగా సాగునీటి కిందకు వస్తుందని పేర్కొంది. పైగా తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న పర్యావరణ, అటవీ అనుమతులు రాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. అలాగే ప్రభుత్వం చెబుతున్నట్టుగా తాగునీటి కోసం నిర్మిస్తున్న పైప్లైన్ అటవీభూముల గుండా పోతే అనుమతులు తప్పనిసరి కదా అని వ్యాఖ్యానించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్న అటవీభూమిపై సందేహాలు లేవనెత్తింది. ఇందుకు సంబంధించి అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. అలాగే పిటిషనర్ కోరినట్టుగా ప్రాజెక్టు నిర్మాణంపై స్టే ఎందుకు విధించకూడదో వివరణివ్వాలని పేర్కొంది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
సరైన అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని జస్టిస్ జావెద్రహీం నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం వరుసగా రెండోరోజూ గురువారం విచారించింది. మొదట తెలంగాణ తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్రోహత్గీ వాదించారు. ఈ ప్రాజెక్టుతో 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు జంటనగరాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చనున్నామని చెప్పారు. హైదరాబాద్ అవసరాలకు 35 టీఎంసీలు, ఇతర ప్రాంతాలకు 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 10 టీఎంసీలు వినియోగించనున్నామని చెప్పారు. సాగు, తాగునీటి వినియోగం కోసం ట్రంక్రూట్ మాదిరిగా వేర్వేరుగా పైప్లైన్లు నిర్మిస్తున్నామని వివరించారు. పైగా సాగునీటి వినియోగం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ, అటవీ అనుమతులకు దరఖాస్తు చేసుకుందని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఏదైనా కారణాలతో అనుమతులు నిరాకరిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టును తాగునీటి కోసమే మాత్రమే వినియోగిస్తామని అవసరమైతే పక్కరాష్ట్రాలకు తాగునీరు అందిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా తాగునీటికి కటకట ఉందని చెప్పారు. పైగా తాగునీటి కోసం నిర్మించే పైప్లైన్ల కోసం అటవీ భూమిని మళ్లించబోమని తెలిపారు.
అయితే ఇందుకోసం ఎంతమేర అటవీభూమి వినియోగం జరగనుందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే దీనిపై అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. అనంతరం పిటిషనర్ తరపున సంజరు ఉపాధ్యాయ వాదనలు వినిపించారు. కేవలం పైప్లైన్ నిర్మాణం చూపి మొత్తం ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా మార్చారని మరోసారి ధర్మాసనానికి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి చట్టబద్దమైన అనుమతులు లేవని అన్నారు. పైగా కాళేశ్వరం, ప్రాణహిత రెండూ వేర్వేరు ప్రాజెక్టులని చెప్పారు. కానీ ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రతిసారీ ప్రాణహితను ప్రస్తావిస్తున్నారని వివరించారు. 'తయారీ రంగ ఫ్యాక్టరీలోని వ్యర్థ జలాలను ఆర్ఓ ద్వారా శుద్ధిచేసి తాగునీటికి మార్చితే ఆ పరిశ్రమ తాగునీటి పరిశ్రమ కాదు. అది తయారీ రంగ పరిశ్రమనే. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అంతే' అని ఉదహరించారు. టెండర్తో పాటు అంతరాష్ట్ర బోర్డు మీటింగ్లోనూ, ప్రాజెక్టుకు కేటాయించిన బడ్జెట్ ఇలా అన్నింటిలోనూ కాళేశ్వరంను సాగునీటిగా పేర్కొన్నారని స్పష్టం చేశారు. పర్యారవరణ, అటవీ, భూగర్భజలాల విభాగం ఇలా ఏ అనుమతీ తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని చెప్పారు. పైగా కాళేశ్వరం టన్నల్లో బుధవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు కూలీలు మృతి చెందారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
పైగా అరెస్టులు, నిర్భందాల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని, ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలను అందజేశారు. పైగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం 3,168 ఎకరాల అటవీభూమిని వినియోగిస్తున్నారని చెప్పారు. అయితే అటవీభూమి వినియోగంపై అఫిడవిట్ సమర్పించేందుకు కొంత గడువు ఇవ్వాలని ఈ సందర్భంగా ముకుల్రోహత్గీ కోరారు. అయితే అప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణంపై స్టే విధించాలని పిటిషనర్ న్యాయవాది అభ్యర్థించారు. ఆ అభ్యర్థనను ధర్మాసనం సున్నితంగా తిరస్కరించింది. తదుపరి కేసును అక్టోబర్ 3కు వాయిదా వేసింది.