Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 లక్షల విద్యార్థులకు 90వేల టీచర్లేనటా.?
- టీచర్ల వివరాలు బహిర్గత పరచని యాజమాన్యాలు
- నిబంధనల నుంచి మినహాయింపునకు తప్పుడుదారులు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలకు ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు అనేక తప్పుడు దారులు వెతుక్కుంటున్నాయి. దీనిలోభాగంగానే ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల పేర్లనూ బయటపెట్టలేని స్థితికి చేరుకున్నారు. ఇది తెలిసినా ఆయా శాఖల అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. తెలంగాణరాష్ట్రంలో 2016-17అధికారిక లెక్కల ప్రకారం 41,337 పాఠశాలలుండగా, వీటిలో 58,66,786 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రయివేటు, కార్పొరేటు యాజమాన్యాల చేతిలో 11,366 పాఠశాలలుంటే, వాటిలో 30,07,395 (మొత్తం విద్యార్థుల్లో 51.26శాతం) మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ, లోకల్బాడీ పాఠశాలలు 25,991 ఉండగా, వీటిలో 22,87,120 మంది (38.98శాతం) విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో 38.98శాతంగా ఉన్న విద్యార్థుల కోసం లక్షా 24 వేల మంది టీచర్లు ఉన్నారు. కానీ ప్రయివేటు పాఠశాలల్లో 51.26శాతం మంది విద్యార్థులకు గానూ కేవలం కేవలం 95వేల మంది (2015-16 లెక్కల ప్రకారం) టీచర్లు పనిచేస్తున్నట్టు యాజమాన్యాలు చూపించాయి. ఈ విద్యాసంవత్సరం ఆ సంఖ్య 90వేలకు చేరిందని అధికారులు చెబుతున్నారు. ప్రయివేటు బడుల్లో 2014-15లో అధికారిక లెక్కల ప్రకారం 1,11,340 ఉపాధ్యాయులుంటే, రెండేండ్లలోనే 20వేల టీచర్లకు పైగా తగ్గడం గమనార్హం. ప్రస్తుతమున్న టీచర్ల సంఖ్యలో కేవలం 4,048 మంది మాత్రమే ఉపాధ్యాయ విద్యలో శిక్షణ పొందని వారు ఉన్నారని యాజమాన్యాలు లెక్కలు చూపించాయి. వాస్తవ లెక్కలను గుర్తించేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
నిబంధనల నుంచి తప్పించుకునేందుకు...
కార్మికశాఖ నిబంధన నుంచి తప్పించుకునేందుకు యాజమాన్యాలు విద్యాశాఖకు తప్పుడు సమాచారం ఇస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. వాస్తవంగా లక్షా50వేలకుపైగానే ప్రయివేటు పాఠశాలల్లో టీచర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. సిబ్బందితో కలిపితే రెండులక్షల వరకూ ఉంటారని భావిస్తున్నారు. కార్మికశాఖ నిబంధనల ప్రకారం పది మంది, ఆపై ఒకే యాజమాన్యం కింద పనిచేస్తే ఆ ఉద్యోగులకు పీఎఫ్ అమలు చేయాలి, 20 మంది, ఆపై పనిచేస్తే ఈఎస్ఐ కూడా వర్తింపజేయాలి. పీఎఫ్ కోసం ఉద్యోగి వేతనంలోంచి 12శాతం కట్ చేస్తారు. అంతే మొత్తం యాజమాన్యం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలను యాజమాన్యాలు తక్కువగా చూపిస్తున్నారని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు తనిఖీల సందర్భంగా గుర్తించినా, పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. పీఎఫ్, కార్మికశాఖల అధికారులూ ఈ పాఠశాలలను పట్టించుకోవడం లేదు. వాటిలోని సిబ్బందికి నిబంధనల ప్రకారం వేతనాలు ఇస్తున్నారా? పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తున్నారా.? అనే విషయాలను పరిశీలించడం లేదు. మరోపక్క లెక్కల్లో చూపని టీచర్లు ఎక్కువమంది అన్ట్రైన్డ్ టీచర్లే అయి ఉంటారని అధికారులు చెబుతున్నారు. దీనికి భయపడి సరైన లెక్కలు బయటకు చెప్పడం లేదనే వాదనలూ ఉన్నాయి. ఏదిఏమైనా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఉద్యోగులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.