Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడపై నుంచి పడి విద్యార్థి మృతి
- ఆరేసుకున్న బట్టలు తెచ్చుకునే క్రమంలో జారిపడి ప్రమాదం
- జోనల్ స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చి మరణం
నవతెలంగాణ-భీమారం
గురుకుల పాఠశాలలో ప్రమాదవశాత్తు మేడపై నుంచి పడి విద్యార్థి చనిపోయాడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగింది. ఇదే పాఠశాలలో జూలై 15న రాకేశ్ అనే విద్యార్థి నిద్రిస్తున్న సమయంలో ఊచలు లేని కిటికీలోంచి పడి మృతిచెందిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు చెందిన వెంకటేష్(14) అదే జిల్లాలోని హుస్నాబాద్ గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 21న ప్రారంభమైన కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల జోనల్స్థాయి క్రీడాల్లో పాల్గొన్నాడనికి జైపూర్ వచ్చాడు. ఈ పోటీలు ఆదివారంతో ముగియడంతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ప్రజాప్రతినిధులు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లే క్రమంలో మేడపై ఆరేసిన బట్టలు తెచ్చుకోవడానికి వెంకటేష్ బిల్డింగ్పైకి వెళ్లాడు. బట్టలు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. వెంటనే అక్కడ ఉన్న వారు గమనించి 108కు సమాచారం అందించారు. మంచిర్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మార్గమాధ్యంలో చనిపోయాడు. విషయం తెలుసుకున్న జైపూర్ ఏసీపీ సీతారాములు, శ్రీరాంపూర్ సీఐ నారాయణ నాయక్, స్థానిక ఎస్సై రమేష్లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మేడపై ఉన్న కోతుల గుంపును చూసి, బెదిరిపోయి కంగారులో మేడపైనుంచి కింద పడిపోయి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.