Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి: పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ తీర్మానం
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
పాత పింఛన్ విధానాన్ని రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఉద్యమాలు చేయాలనీ పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. గతంలో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేవిధంగా ఢిల్లీలో ఆందోళనలో చేసినట్టుగానే రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. హైదరాబాద్లోని జిల్లెలగూడలో ఆదివారం పీఆర్టీయూ రాష్ట్ర 32వ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి సరోత్తంరెడ్డి మాట్లాడుతూ...ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించేది లేదని, అవసరమైతే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీసీఈ విధానం రద్దు, పండిత్ పోస్టుల అప్గ్రేడ్ సాధించడంలో సంఘం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి చెన్నకేశవరెడ్డి కార్యదర్శి నివేదికను కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సర్వీస్రూల్స్ రూపొందించి, ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలనీ, ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏండ్లకు పెంచాలని తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్రెడ్డి, పూల రవీందర్, ఏఐటీఓ చైర్మెన్ మోహన్రెడ్డి, పర్వతి సత్యనారాయణ, నరహరి లక్ష్మారెడ్డి లతో పాటు జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
కాంప్రమైజ్...
పీఆర్టీయూ కౌన్సిల్ ఎన్నికల్లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి ప్రత్యేకంగా ప్యానల్తో పోటీ చేయాలని భావించారు. దీంతో రాష్ట్ర అధ్యక్షులు సరోత్తంరెడ్డి సైతం అదే దారిలో నడిచారు. ఎవరికివారుగా జిల్లాల్లోని నాయకత్వం మద్దతు కోసం చర్చలూ జరిపారు. అయితే చివరి నిమిషంలో ఎమ్మెల్సీ జనార్ధన్రెడ్డి జోక్యం చేసుకుని ఇద్దరినీ కాంప్రమైజ్ చేసినట్టు సంఘం ముఖ్యనేత ఒకరు తెలిపారు. దీంతో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పోస్టులకు ఒక్కో నామినేషనే దాఖలైంది. సోమ వారం వారిద్దరినీ ఏకగ్రీవంగా గెలుపొందినట్టు ప్రకటించననున్నారు.