Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితుల ఆత్మహత్యలకు పాలకులే కారణం : ఉత్తమ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఆ తర్వాత హామీలను విస్మరించిందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు తిరగబడే రోజులు దాపురిస్తున్నాయని హెచ్చరించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రజలు ఓట్లు వేశారని, వాటిని నెరవేర్చకపోవడంతో పేదలు, దళితులు, మైనార్టీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీభవన్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు దూద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు క్యామ మల్లేశం, వరంగల్ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి, పార్టీ నేత తాహెర్ బిన్లతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహంకాళి శ్రీనివాస్, అయుబ్ ఖాన్ల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ
కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే ప్రాజెక్టుల పేరుతో చట్ట విరుద్దంగా చేసే పనులను అడ్డుకుంటామని ఉత్తమ్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణంపై ఇటీవల జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ అంశాలకు సంబంధించిన సమావేశం జరిగింది. అనంతరం ఉత్తమ్ కుమార్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాము ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో రాజకీయ సభలు నిర్వహించారని, ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదని ఆరోపించారు. చట్టాలను పక్కన పెట్టి, కేవలం తమకు అనుకూలమైన వారితో టీఆర్ఎస్ నేతలు సభలు నిర్వహించి బలవంతంగా అభిప్రాయ సేకరణ చేశారని విమర్శించారు. ప్రజల విజ్ఞప్తులను అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిపుణుల కమిటీని వేసి లోతుగా అధ్యయనం చేసి తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణం అంశాలపైన చర్యలు తీసుకుంటామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి కోసం, రైతుల కోసం కాకుండా కేవలం కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందన్నారు.