Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరచూ 'గుర్తింపు' ఎన్నికలు వాయిదా
- తాజాగా ఎనిమిది వారాలకు..
- అధికారులపై కార్మికుల అసహనం
- విద్యుత్ శాఖలోని విచిత్ర పరిస్థితులు
నవతెలంగాణ - సిటీబ్యూరో
విద్యుత్శాఖలో గుర్తింపు సంఘం ఎన్నికలు రెండు నెల లుగా వాయిదా పడుతూనే వస్తున్నాయి. చిన్నచిన్న సాకుల తో ఎన్నికలను నిలువరించేందుకు కొందరు కుట్రలకు పాల్ప డుతున్నారనే అనుమానాలు కార్మికుల్లో వ్యక్తమవుతున్నాయి. గుర్తింపు కార్డులు లేవనే సాకుతో ఒకసారి వాయిదాపడ్డాయి. గుర్తింపు ఎన్నికలు కేవలం రెండు స్టేజీల్లో కాకుండా నాలుగు భాగాలుగా ఉండాలని ఒక యూనియన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే ఇచ్చింది. అదే సమయంలో వాయిదా స్టేను ఎత్తేసి, ముందస్తు నిర్ణ యం ప్రకారమే జరగాలంటూ ఎన్నికల వాయిదాపై మరో యూనియన్ స్టే తెచ్చినప్పటికీ సమయం మించిపోయిందనే నెపంతో మరుసటిరోజు జరగాల్సిన ఎన్నికలను కార్మికశాఖ అర్థాంతరంగా వాయిదా వేసింది. తాజాగా మరో ఎనిమిది వారాలు ఎన్నికలను న్యాయస్థానం వాయిదా వేసినట్టు కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. దీని వెనుక గెలుపోటములను ప్రభావితం చేయగల ఓ యూనియన్ను మరో ప్రధాన యూనియన్ తనలో విలీనం చేసుకునే క్రమంలోనే ఇది జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
మూడు దశాబ్దాల అనంతరం...
విద్యుత్శాఖలో ఇటీవల యూనియన్లు, యూనియన్ నాయకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కార్మికుల సమస్యలను ఆయా యూనియన్ల ద్వారా యాజమాన్యానికి నివేదించడం, వాటి పరిష్కారానికి అధికారులపైనా, యాజ మాన్యంపైనా యూనియన్లు, యూనియన్ నేతల ఒత్తిడి రోజురోజుకీ పెరుగుతున్నది. ఈ తరహా పరిణామాలతో అనే క యూనియన్లు, నాయకులు పుట్టుకురావడంతో యాజమా న్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే భావనతో విద్యుత్శాఖ కార్మికులకు గుర్తింపు సంఘం ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. మూడు దశాబ్దాల కింద (ఆఖరి ఎన్నికలు 1989లో) జరిగిన ఎన్నికలు ఈ ఏడాది నిర్వహించేందుకు కార్మికశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం, నామినేషన్లు స్వీకరించే వంటి ప్రక్రియలను పూర్తిచేసింది. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి.
ఎన్నికల నిర్వహణకు ఆటంకాలేంటి...?
ఇప్పటికే ఈ ఎన్నికలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. అసలీ గుర్తింపు సంఘం ఎన్నికలు ఎందుకు వాయిదా పడుతున్నాయి. దీని వెనుక ఎవరి హస్తం ఉంది. నిజంగానే సాంకేతిక కారణాలతోనే వాయిదా పడుతున్నాయా..?. లేదంటే, కాలయాపన చేసేందుకే సాంకేతిక కారణాలను సృష్టిస్తున్నారా? అనే విషయాలు మింట్ కాంపౌండ్లో చక్కర్లు కొడుతున్నాయి. కార్మికులకు గుర్తింపుకార్డులు లేవనే సాకుతో ఆగస్టు ఎనిమిదో తేదీ జరగాల్సిన ఎన్నికలను నెలపాటు వాయిదా వేసినట్టు స్వయంగా కార్మికశాఖ అధికారులే ప్రకటించారు. విద్యుత్శాఖలో 2016 నవంబర్ వరకూ చేరిన ఓ అండ్ ఎం పర్మినెంట్ ఉద్యోగులు ఈ ఎన్నికల్లో ఓటరుగా పరిగణిస్తారు. జూనియర్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్మెన్లోని రెండు విభాగాలు, ఎల్డీసీ, యూడీసీ, జేఏవో స్టాఫ్కు శాఖాపరమైన గుర్తింపుకార్డులు లేకపోవడమేంటి...? అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా నెలరోజుల తర్వాత సెప్టెంబర్ 8న జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడ్డాయి. గుర్తింపు యూనియన్ను టూ టైర్లో కాకుండా రీజినల్గా అంగీకరించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు కల్పించాలని కోరుతూ అంతవరకూ ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఓ యూనియన్ కోర్టును ఆశ్రయించింది. ఫలితంగా ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే జారీచేసింది. ఈ స్టేను ఎత్తేసి యథాతథంగా ఎన్నికలు జరపాలని కోరుతూ ఎన్నికల వాయిదా స్టేపై మరో యూనియన్ స్టే తీసుకొచ్చింది. అయితే అప్పటికే సాయంత్రం 5 గంటలు దాటిందనే సాకుతో ఎన్నికల జరగాలనే కోర్టు స్టేను పరిగణనలోకి తీసుకోకుండా కార్మికశాఖ ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేసినట్టు విమర్శలు వస్తున్నాయి.
రాజకీయ ప్రాబల్యం కోసమేనా..!?
గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయనే అనుమానాలు కార్మికుల్లో ఉన్నాయి. సుమారు 28 ఏండ్ల తర్వాత జరగబోతున్న ఈ ఎన్నికలను కార్మికులందరూ స్వాగతిస్తుండగా, ఎన్నికలు తరుచుగా వాయిదాపడేలా వివిధ తిరకాసు పిటిషన్లను న్యాయ స్థానాల్లో వేస్తూ ఎన్నికలు వాయిదా పడేందుకు చేస్తున్న చర్యలపై కార్మికులు అసహనానికి గురవుతున్నారు. తాజాగా ఈ ఎన్నికలను ఎనిమిది వారాలపాటు న్యాయస్థానం వాయిదా వేయగా, ఇక ఎన్నికలు జరిగే అవకాశమే లేదంటూ కార్మికులు చర్చించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల పైచిలుకు ఓటర్లు కలిగిన ఈ ఎన్నికలలో... గెలుపోటములను ప్రభావితం చేయగల ఓ ప్రధాన యూనియన్ను, మరో యూనియన్ విలీనం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు, ఈ ప్రయత్నాలేవీ ఫలించకపోవడం కారణంగానే సాంకేతిక కారణాల పేరిట కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు తరుచుగా వాయిదా పడుతున్నట్టు కార్మికుల్లో అనుమానాలు బలంగా ఉన్నాయి.