Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వంపై కేసులు పెట్టాలి
- వచ్చేనెల 8 నుంచి ఐద్వా రాష్ట్ర మహాసభలు: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల హైమావతి
నవతెలంగాణ-ఖమ్మం
నాసిరకం చీరలు పంచుతూ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన రాష్ట్ర ప్రభుత్వంపై కేసులు పెట్టాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల హైమావతి అన్నారు. అక్టోబర్ 8, 9, 10తేదీల్లో మేడ్చల్ జిల్లా ప్రగతినగర్లో జరిగే ఐద్వా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం ఖమ్మంలోని మంచికంటి భవన్లో జరిగిన ఐద్వా జిల్లా మహాసభలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విలేకర్లతో ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సంక్షేమ పథకాలను ఉపయోగించు కుంటున్నాయని, సంక్షేమ పథకాలంటే ప్రజల అవసరాలు తీర్చేవిగా ఉండాలని, ప్రచార ఆర్భాటాల కోసం కాదని చెప్పారు. కొందరు బాబాల ముసుగులో అనేక దుర్మార్గాలకు పాల్పడుతుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తోందన్నారు. మహిళల అభివృద్ధి జరగాలంటే వందశాతం అక్షరాస్యత సాధించాలన్నారు. నాటి కాంగ్రెస్, నేటి బీజేపీ ప్రభుత్వాలు మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మొండి చేయి చూపించాయన్నారు. మహిళలకు కనీస వేతనం అమలు చేసి వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ పాల్గొన్నారు.