Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు కాలేజీల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలి
- విద్యారంగంపై కేంద్రం పెత్తనం ప్రమాదం : ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి విక్రంసింగ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వృత్తివిద్యను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) ప్రధాన కార్యదర్శి విక్రంసింగ్ విమర్శించారు. వృత్తివిద్యా పరిరక్షణకు జాతీయ ఉద్యమం నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వృత్తి విద్యార్థుల జాతీయ సమ్మేళనంలో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం సాగించడం ప్రమాదకరమని అన్నారు. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) నిధులు పొందాలంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)ను కచ్చితంగా అమలు చేయాలని నిబంధన విధించడం సమంజసం కాదన్నారు. కాలేజీల్లో మౌలిక వసతులు, సరిపోయినంత మంది అధ్యాపకులు లేకుండా సీబీసీఎస్ అమలు చేయడం సరికాదని చెప్పారు. ఐఐటీల్లో 36 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఇక ఇంజినీరింగ్, ఇతర కాలేజీల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతోందని వివరించారు. వసతుల కల్పన, అధ్యాపక పోస్టుల భర్తీ తర్వాతే సీబీసీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకోవైపు విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని కేంద్రం దెబ్బతీస్తోందని విమర్శించారు. స్థానిక, భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాల ఆధారంగా సిలబస్ రూపొందించాల్సి ఉండగా, కేంద్రం చెప్పినట్టుగా సిలబస్ ఉండాలని ఒత్తిడి పెంచుతోందని చెప్పారు. నాణ్యత లేక వృత్తివిద్యారంగం సంక్షోభంలో ఉందన్నారు. విద్యార్థులకు డిగ్రీపట్టా చేతికొచ్చినా ఉపాధి అవకాశాలు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలిస్తామని పలు సంస్థలు చెప్తున్నాయని అన్నారు. ఇప్పటికే బలహీనంగా ఉన్న వృత్తి విద్య సీబీసీఎస్ అమలులో మరింత బలహీనంగా మారిందన్నారు. ప్రయివేటు కాలేజీల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, ప్రవేశాలు కల్పిస్తున్నాయని చెప్పారు. ప్రయివేటు కాలేజీల్లో ఫీజు, ప్రవేశాలు, పరీక్షల విధానం పకడ్బందీగా ప్రభుత్వ నియంత్రణలో ఉండేలా ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు విపి సాను మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడేండ్లు దాటినా హామీ అమలు కావడం లేదన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల ఇటీవల 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో వృత్తివిద్యారంగం దిగజారుతోందని చెప్పారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ వృత్తివిద్య మూఢవిశ్వాసాలను పెంచే విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు మయూక్ బిశ్వాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేష్, లక్ష్మణ్, ఓయూ కార్యదర్శి మూర్తి తదితరులు పాల్గొన్నారు.