Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
సమాజంలోని సమస్యలను తమ రచనలతో కవులు, రచయితలు ఎజెండా అంశాలను చేయాలని నవతెలంగాణ సంపాదకులు ఎస్ వీరయ్య కోరారు. ఎవరికో సేవ చేయడానికి రచనలు చేయవద్దని సూచించారు. హైదరాబాద్లోని టీపీఎస్కే కార్యాలయంలో ఆదివారం తెలంగాణ సాహితీ కార్యశాల జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరయ్య మాట్లాడుతూ...భావోద్వేగాల లేకుండా ఎవ్వరూ రచయితలు, కవులు కాలేరని అన్నారు. నాటికాలంలో మాదిరిగా కవులు వారి రచనలతో రాజులకు సేవ చేసేవిధంగా ఉండొద్దనీ, ప్రజలను చైతన్యవంతం చేసేలా ఉండాలని తెలిపారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు సేవ చేయాలనే భావనతోనే ఉన్నారని అన్నారు. ప్రజల్లో భాగమై, వారి బాధలను పంచుకోవాలన్నారు. నాడు గురజాడ అప్పారావును అప్పట్లో పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదనీ, కానీ ఆయన మరణించిన తర్వాత ఆ రచనల ద్వారా గొప్పవాడుగా గుర్తింపు పొందారని చెప్పారు. జనం కోసం రచనలు చేసినవారే జనం హృదయాల్లో నిలిచిపోతారని స్పష్టం చేశారు. దాశరథి, శ్రీశ్రీ, వేమన రచనలు సమాజంపై తీవ్రప్రభావం చూపించాయని అన్నారు. గద్దర్, విమలక్క, సోమన్న లాంటి వారు ప్రజాకవులుగా గుర్తింపుపొందారని చెప్పారు. కథ, కథనం, రచనలు సాగరమథనం లాంటివని చెప్పారు. రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు పెరిగిపోయాయనీ, గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో ఎస్సీ, బీసీ కులాలకు చెందిన వారిని గ్రామ బహిష్కరణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఆధారంగా తీసుకుని పాలకులు తప్పుదారి పట్టించే కుట్రలు పన్నుతున్నారని, వీటిపై రచనలు చేసి ప్రజల్లో చైతన్యం నింపాలని సూచించారు. రచయితలు సున్నితమైన అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యశాలలో తెలంగాణ సాహితీ నాయకులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, సాహితీ రాష్ట్ర కన్వీనర్ ఆనందచారి, నాయకులు ఆనందకుమార్, జి నరేశ్, రాంపల్లి రమేశ్, సలీమ, వడ్డేపల్లి మల్లేశం, రమణాచారి, వి జనార్ధన్, మోహన్కృష్ణ, తంగిరాల చక్రవర్తి, మహేశ్ దుర్గే, భారతి, సతీశ్, రాంకుమార్, భారతి, వాహేద్ పాల్గొన్నారు.