Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యశోద ఆస్పత్రిలో శ్రీనివాస్ మృతి
- అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు
- మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా: రసమయి
నవతెలంగాణ - బేగంపేట/బెజ్జంకి/తిమ్మాపూర్
భూపంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, తమకు భూమి రాకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ కరీం నగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకున్న శ్రీనివాస్ హైదరాబాద్లోని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన పరుషరాములు, శ్రీనివాస్ అనే ఇద్దరు దళిత యువకులు ఈనెల 3న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం విదితమే. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. దళితులకు భూ పంపిణీ విషయంలో గూడెం గ్రామానికి చెందిన మంకాల శ్రీనివాస్(28), యాలాల పర్షరాములు మరికొంత మంది బాధితులతో ఈ నెల 3వ తేదిన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయానికి వెళ్లారు. పొద్దుగాల నుంచి మధ్యాహ్నం రెండింటి దాకా ఎదురు చూసినా ఎమ్మెల్యే రాకపోవడంతో...ఫోన్లో ఎమ్మెల్యేతో తమ గోడును చెప్పేందుకు యత్నించగా...'ఏం చేసుకుంటారో చేసుకోండి...' అంటూ ఎమ్మెల్యే హెచ్చరించడంతో తట్టుకోలేకపోయారు. తీవ్ర మనస్తాపానికి గురై తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో వారిద్దరూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. 22 రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం పరిస్థితి విషమించి శ్రీనివాస్ మృతి చెందాడు. మృతుడికి భార్య శ్రావణి, ఇద్దరు కుమారులు శశాంక్ (5), మను(3) ఉన్నారు. ఆదివారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీనివాస్ భార్య శ్రావణి పేరుపై మూడెకరాల భూమి, ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లు, రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ తెలిపారు. మిగతా వారికి వారంలోపు భూ పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.
పలుచోట్ల ఆందోళనలు...అరెస్టులు
కరీంనగర్ జిల్లా అల్గునూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట, అల్గునూరు చౌరస్తాలో టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. అనంతరం వారిని అరెస్టు చేసి, నగర శివారుల్లోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ తిరుపతి ఆధ్వర్యంలో అల్గూనూర్ చౌరస్తా, ఎమ్మెల్యే కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనుకొండ నాగేశ్వర్రెడ్డి, టీడీపీ మండలాధ్యక్షులు కేతిరెడ్డి అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ మృతికి కారకులైన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రసమయి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం, ఎమ్మెల్యే, జడ్పీటీసీ, దిష్టిబొమ్మలు దహనం చేశారు. అప్పటికే పోలీసులు ఆ ప్రాంతమంతా మోహరించారు. ఆందోళనకారులను అరెస్టు చేసి కోహెడ పోలీస్టేషనుకు తరలించి అనంతరం విడుదల చేశారు.
రక్త సంబంధీóకున్ని కోల్పోయా...బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
గూడెం గ్రామానికి చెందిన మాంకాలి శ్రీనివాస్ మృతి చెందడం బాధాకరం, రక్త సంబంధీకున్ని కోల్పోయానన్న బాధ వేధిస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శ్రీనివాస్ మృతదేహానికి ఆయన యశోద ఆస్పత్రిలో నివాళులు అర్పించారు. భూపంపిణీలో భాగంగా ఎకరం పదిగుంటల భూమి శ్రీనివాస్ తల్లిపేరున రిజిస్ట్రేషన్ అయిందని, రెండో విడత భూపంపిణీలో మరో 30 ఎకరాల భూమి సేకరించి బాధితులకు పంచుదామనుకునే లోపే ఈ ఘటన జరగటం దురదృష్టకరమని అన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్గ్రేషియా, డబుల్ బెడ్రూంతోపాటు మృతుని భార్యకు జీవనోపాధి కల్పిస్తామని హామీనిచ్చారు.