Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్టేబుల్లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి వల్ల ఆహార భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. 'ప్రపంచ ఆహార దినోత్సవం' సందర్భంగా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఎఐకేఎస్సీసీ) ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టీ. సాగర్ అధ్యక్షత వహించారు. ముందుగా ఎఐకేఎమ్ఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ ప్రజలకు పోషకాహారం అందించడంలో మన దేశం 65వ స్థానంలో ఉన్నదని చెప్పారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు మద్దతిస్తున్నాయి తప్పా రైతులు పండించిన పంటలకు మద్దతు ధర చెల్లించడం లేదని విమర్శించారు. రైతులకు రెట్టింపు ఆదాయం ఎలా వస్తుందో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే కొద్దిపాటి సబ్సిడీలను కూడా ప్రభుత్వాలు రద్దు చేస్తున్నాయని అన్నారు. ఆహార ధాన్యాలు సేకరించడం, నిల్వ చేయడం నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఎన్డీయే, బీజేపీ ప్రభుత్వాలు శాంతకుమారి కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోలేదన్నారు. జస్టిస్ (రిటైర్డ్) చంద్రకుమార్ మాట్లాడుతూ ఆహార దిగుబడులు తగ్గుతున్నాయని, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. స్వదేశీ మార్కెట్లు దెబ్బతింటున్నాయని అన్నారు. రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని అన్నారు. రైతు స్వరాజ్య వేదిక నేత విస్సా కిరణ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాల పని తీరువల్ల ఆహార భద్రతకే ముప్పు వాటిల్లకుండా, చిన్నసన్నకారు రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘాలు, పేద ప్రజలు ఉద్యమించాలని కోరారు. రైతు జేఏసీ నేత కన్నెగంటి రవి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, వారికి తగిన గుర్తింపు లేదన్నారు. వరి, గోధుమలు మన అవసరాలకు మించి ఉత్పత్తి అవుతు న్నాయని అన్నారు. తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు మాట్లాడుతూ 60 శాతం జనాభా తమకు కావాల్సిన ఆరోగ్యవంతమైన తిండి తినే పరిస్థితి లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం వల్ల చిన్నసన్నకారు రైతులకు కొంత ఊరట కలుగు తుందని చెప్పారు. బొంతల చంద్రారెడ్డి మాట్లాడుతూ ఏ రంగంలో చూసినా వృద్ధిరేటు కనిపించడం లేదన్నారు. ఎగుమతి దారులకు లాభం, ఉత్పత్తిదారులకు నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆహారధాన్యాల కొరత తీవ్రంగా ఉందన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధక్షులు ప్రసాద్ మాట్లాడుతూ ఆహార భద్రతకే కాకుండా విద్యారంగంలోనూ ప్రమాదకర పరిస్థితులున్నాయని చెప్పారు. అన్ని రంగాలను ప్రయివేటు పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయడం అందులో భాగమేనని అన్నారు.