Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలినడక ఓ అవకాశమే కాదు.. జీవితంలో గొప్ప అనుభూతి...
- ఆ స్ఫూర్తితో మరింత సమరశీలంగా పనిచేస్తాం
- మహాజన పాదయాత్ర బృంద సభ్యుల అంతరంగం
మహాజన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో సామాజిక అజెండాను తెరపైకి తీసుకు రాగలిగామని పాదయాత్ర బృంద సభ్యులు తెలిపారు. ఈ యాత్రలో పాల్గొనే అవకాశం రావటం ఒక అదృష్టంగా భావించాం.. అంతకుమించి వివిధ తరగతుల ప్రజానీకపు హృదయ స్పందనను ప్రత్యక్షంగా చూడటమనేది తమ జీవితాల్లో గొప్ప అనుభూతి అని వారు చెప్పారు. పాదయాత్ర ప్రారంభమై మంగళవారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ యాత్ర ఇచ్చిన స్ఫూర్తితో మరింత సమరశీలంగా పనిచేస్తామంటున్న బృంద సభ్యులతో 'నవతెలంగాణ' మాటామంతీ.. ఆ వివరాలు వారి మాటల్లోనే...
నవతెలంగాణ బ్యూరో హైదరాబాద్
ఐక్య కార్యాచరణకు బీజం పడింది...:జాన్వెస్లీ
''యాత్ర మాకు గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఇదే క్రమంలో రాష్ట్రంలోని వివిధ సామాజిక తరగతులు, శక్తులు, వ్యక్తులు, సంఘాలు.. విడివిడిగా పోరాడుతున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కావటం లేదనే అసంతృప్తి అందరిలో ఉంది. ఈ క్రమంలో మహాజన పాదయాత్రతో.. రాష్ట్రంలో ఒక ఐక్య కార్యాచరణకు బీజం పడింది. దాని ఫలితమే టీ మాస్ ఆవిర్భావం...''
ఐటీ నుంచి వృత్తుల వైపు.. : ఎమ్వీ రమణ
''పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రి చూపును ఐటీ, స్కైవేలు, హైవేల నుంచి వృత్తులవైపునకు, వృత్తిదారుల వైపునకు మళ్లించగలిగాం. ఈ క్రమంలోనే గీత కార్మికులు, గొర్రెల కాపర్లు, మత్స్యకారులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం అనేక పథకాలు, రాయితీలను ప్రకటించాల్సి వచ్చింది...''
మహిళలు అక్కున చేర్చుకున్నారు...: ఎస్.రమ
''మా యాత్రను అన్ని వర్గాలు, తరగతుల మహిళలు అక్కున చేర్చుకున్నారు. ఊరూ, వాడా, పల్లెపల్లెలో పండుగలాగా జరుపుకున్నారు. యాత్ర ఫలితంగా అసంఘటితరంగ కార్మికులైన అంగన్వాడీలు, ఆశాలు, ఐకేపీ ఉద్యోగులకు కొంత వరకు న్యాయం జరిగింది. వారి సమస్యలపై ప్రభుత్వం స్పందించింది...''
ఎంబీసీల గొంతుకను వినిపించాం.. :పైళ్ల ఆశయ్య
''బడుగుల.. ఇంకా చెప్పాలంటే ఎంబీసీల గొంతుకను పాదయాత్రలో బలంగా వినిపించాం. మేం పాదయాత్ర మొదలుపెట్టిన కొద్ది రోజులకే ఎంబీసీల కార్పొరేషన్ను, ఆ తర్వాత దానికి చైర్మెన్ను నియమించారు. జాతీయ స్థాయిలో కూడా ఎంబీసీల స్థితిగతులపై అధ్యయనం కోసం జస్టిస్ రోహిణీ కమిషన్ను వేశారు...''
మైనారిటీల సమస్యలపై కదలిక...: ఎమ్డీ అబ్బాస్
''పాదయాత్ర వల్ల మైనారిటీల సమస్యలపై సర్కారులో కదలిక వచ్చింది. వారి రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామంటూ సర్కారు ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీని నిర్వహించారు. వీటితోపాటు ప్రధానంగా రుణాల విషయంలో ఒక లక్షగా ఉన్న పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. రాష్ట్రంలో 100 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశారు...''
యాత్ర వల్లే గిరిజన వర్శిటీ ప్రకటన..: మూడ్ శోభన్ నాయక్
''కాలినడక కష్టం ఊరికే పోలేదు. దాని ప్రభావం వల్లే ములుగులో గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామంటూ సర్కారు ప్రకటించింది. అయితే ఇదొక్కటే సరిపోదు. మైదాన గిరిజన ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయాలి...''
ఉపాధి సమస్యలకు పరిష్కారం... : నగేశ్
''పాదయాత్ర సందర్భంగా అనేక జిల్లాల్లో వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు సమస్యలను మాకు ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా ఉపాధి బిల్లులు కోట్లలో పెండింగ్లో ఉన్నాయనే విషయం తేలింది. దీనిపై సీఎంకు లేఖలు రాసిన ఫలితంగా చాలా వరకు బిల్లులు క్లియర్ అయ్యాయి...''
చేసింది కొంతే.. చేయాల్సింది ఇంకెంతో..: నైతం రాజు
''పాదయాత్ర వల్ల ఆదివాసీలకు సంబంధించిన అనేకాంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ చేసింది కొంతే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అటవీ హక్కుల చట్టం, పోడు భూముల పట్టాల కోసం ఉధృత పోరాటాలు నిర్వహించాలి...''