Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర విచారణ కమిటీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముస్లిం మైనర్ బాలికలకు ఖాజీలే వివాహాలు జరిపిస్తున్నారని కేంద్రం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ వెల్లడించింది. కాంట్రాక్టు పేరుతో పెండ్లి చేసుకొని మధ్యలోనే వదిలేస్తున్నారని, కొంతమంది తప్పుడు ద్రువీకరణ పత్రాలతో విదేశాలకు తీసుకెళ్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. హైదరాబాద్ పాతబస్తీలో ఇటీవల అరబ్షేక్లు అక్కడి మైనర్ బాలికలను వివాహం చేసుకుంటున్న పలు ఘటనలు వెలుగు చూశాయి. వీటిపై ప్రధానమంత్రి కార్యాలయం తీవ్రంగా స్పందించింది. వెంటనే దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా కమిటీని నియమించింది. కమిటీలో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అలోక్ రావత్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురనేని వెంకటరత్నంను సభ్యులుగా నియమించింది. వారం రోజుల్లో నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు హైదరాబాద్లోని మహిళా కమిషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కమిటీ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'అరబ్షేక్లు ముస్లిం మైనర్ అమ్మాయిలను కాంట్రాక్టు పేరుతో వివాహం చేసుకుంటున్నారు. కొన్నాండ్లకు వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. దీనిపై ఇప్పటికే విచారణ ప్రారంభించాం. పాతబస్తీకి చెందిన పోలీసు అధికారులతో సమావేశమయ్యాం. ఈ నెల 16న గతంలో మోసపోయిన బాధితులు, ఎన్జీఓలతో సమావేశం ఏర్పాటు చేశాం. ఇందులో 30 మంది పాల్గొన్నారని తెలిపారు.