Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
మూసీ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం 65 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సూర్యాపేట కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. శిథిలావస్థకు చేరిన మూసీ కుడి, ఎడమ కాలువలను మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించనున్నట్టు మంత్రి చెప్పారు. మూసీ కాలువల ఆధునీకరణతో 30 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని వెల్లడించారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, నాగార్జున సాగర్, పాలేరు పాత కాలువ, ఘణపురం ఆనకట్ట తదితర పాత ప్రాజెక్టులు, సాగునీటి పథకాలను పునరుద్ధరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పాత ప్రాజెక్టుల కాలువలను ఆధునీకరించడం వల్ల ఆయా ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతున్నట్టు ఆయన తెలిపారు.