Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో అవినీతి పాలన: శాసనమండలి పక్షనేత షబ్బీర్ అలీ
నవతెలంగాణ-నిజామాబాద్
ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోందని, ఈ విషయమై ఆంటోని కమిటీ నిర్ణయం తీసుకుంటుందని శాసన మండలి కాంగ్రెస్ పక్షనేత మహ్మద్ షబ్బీర్అలీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ ఆకుల లలిత నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో షబ్బీర్అలీ మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతోందని, సీఎం గాలి మాటలతో పాలన అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. అవినీతి మూలాలు సీఎం కేసీఆర్ ఇంటి నుంచే మొదలయ్యాయని విమర్శించారు. దీనిపై సీఎం మౌనం పాటించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బతుకమ్మ చీరల పంపిణీలో అవినీతి జరిగిందని, తెలంగాణ ఆడబిడ్డలకు నాసిరకం చీరలు పంపిణీ చేయడం దురదృష్టకరమని అన్నారు. ఎంపీ కవిత బతుకమ్మ చీరలు కట్టుకుని పార్లమెంట్ సమావేశాలకు వెళ్తారా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై జరిగే సమావేశాలకు ఎంపీ హాజరు కాకపోవడం ఆమెకు ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలల్లో ఖాళీల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదని, మైనార్టీ కార్పొరేషన్లో రూ.5కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లేదని, రైతులకు ఇప్పటికీ రుణమాఫీ అమలు కావడం లేదని తెలిపారు. నిజామాబాద్ నగరంలో ఎంఐఎం కార్పొరేటర్లు పెండను కూడా అమ్ముకుంటున్నారని విమర్శించారు. సమావేశంలో నాయకులు గడుగు గంగాధర్, తాహెర్బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.