Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్లో చేరిక వార్తలపై రేవంత్ పీఆర్వో
- నియోజకవర్గ పర్యటన అనంతరం
- ముహుర్తం ఖరారు ?
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రేవంత్రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారని ప్రచారం జరుగుతుం డగా, మరోవైపు ఆయన పీఆర్వో నూర్మహ్మద్ మాత్రం అదంతా ఉట్టి ప్రచారమేనని ఖండించారు. సుప్రీంకోర్టు పనిమీద రేవంత్ ఢిల్లీ వెళ్లారని అని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని రేవంత్రెడ్డి కలుసుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో, అది నిజమా, కాదా అని తెలుసుకునేందుకు నవతెలంగాణ ప్రయత్నించింది. ఆయన పిఆర్ఓ నూర్ అహ్మద్ మాట్లాడారు. టీవీల్లో వచ్చిన వార్తలన్నీ కరెక్టు కాదని కొట్టిపారేశారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన ఒక కేసు విషయంలో తన న్యాయవాదితో మాట్లాడేందుకు వెళ్లారని అన్నారు. ఆ విషయం మీడియాతో చెప్పడం కుదరదన్నారు. కావాలనే టీడీపీలోని కొంతమంది నేతలు రేవంత్కు వ్యతిరేకంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్తో టీడీపీ పొత్తును రేవంత్రెడ్డి వ్యతిరేకిస్తున్న మాట వాస్తవమేనని, ఆ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియజేశారని అన్నారు. కాంగ్రెస్పార్టీలో చేరాలనుకుంటే దొరగానే వెళతారని, దొంగలా పోవాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్లీనరీకోసం కూలీపని పేర కోట్ల రూపాయలు వసూలు చేసిన విషయంలో ఎన్నికల కమిషన్తో చర్చలు జరపడానికి రేవంత్ ఢిల్లీ వెళ్లినట్టు కూడా ఆయన అనుచరులు చెబుతున్నారు.
కొల్లాపూర్ వెళ్లి..ఢిల్లీకి..
ఇదిలా ఉండగా, తెలంగాణలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేయలేకపోతున్నదన్న భావనతోపాటు అంతర్గతంగా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమవడంతో రేవంత్రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. అందుకే ఆయన పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. డిసెంబరు లేదా జనవరిలో రేవంత్ కాంగ్రెస్లోకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లేముందు రేవంత్ తన కుటుంబంతో కలిసి కొల్లాపూర్ వెళ్లారు. అక్కడ నుంచి బెంగళూరు వెళ్లారని, ఆ తరువాత బెంగళూరు నుంచి ఢిల్లీ చేరుకున్నారని, అక్కడే రాహుల్ను కలిసారని అంటున్నారు. అయితే ఇవన్నీ ఉహాగానాలేనని రేవంత్ ఢిల్లీలో తనను కలిసిన కొంతమంది మీడియాతో చెప్పారు. టీడీపీ నేతలు కొంతమంది రహస్యంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్తో పొత్తు పెట్టించే ప్రయత్నాలు చేసి సఫలమైనట్టు తెలిసింది. 16 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు అడగ్గా, 12 శాసనసభా స్థానాలు, ఒక లోక్సభ నియోజకవర్గాన్ని ఇచ్చేందుకు టీఆర్ఎస్ అంగీకరించిందనే ప్రచారం సైతం ఇప్పటికే రాజకీయనేతల్లో సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇక టీడీపీలో కొనసాగడం ఎంత మాత్రం సబబు కాదనే ఆలోచనలో రేవంత్ పడ్డట్టు సమాచారం. దీపావళి పండుగ తరువాత వారం రోజులపాటు ఆయన తన నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం, కార్యకర్తలు, పార్టీకి చెందిన ఆయా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటి కానున్నారు. పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్లే విషయమై వారితో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ తరువాత జనవరిలో కీలకపరిణామం ఉండే అవకాశం ఉందని రేవంత్ అనుచరులు అంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే సూత్రప్రాయంగా గ్రీన్సిగల్ వచ్చినట్టు సమాచారం.
ఈనేపథ్యంలో తన డిమాండ్లను రాహుల్ ముందు పెట్టారని చెబుతున్నారు. దాదాపు 15 నుంచి 20 మంది కీలకనేతలు రేవంత్ వెంట వెళతారని సమాచారం. ఈనేపథ్యంలో కాంగ్రెస్లో చేరితే టీడీపీలో ఉన్నట్టుగానే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితోపాటు 15 ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ విషయంలో రాజీ కుదిరితే ఇక లాంఛనంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే తరువాయి అని తెలిసింది. ఈలోపు రాహుల్కు పార్టీ అధ్యక్షత బాధ్యతలు సైతం అప్పగిస్తారని, అనంతరమే రేవంత్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.
బాబుకు చెప్పే వెళుతున్నారా.. ?
ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం రేవంత్ చెప్పారని, 'నీకు ఎలా వీలైతే అలా చేయమని ఆయన కూడా సలహా ఇచ్చినట్టు'' తెలిసింది. ఇటీవల విజయవాడలో చంద్రబాబును రేవంత్రెడ్డి కలసుకున్న సమయంలోనే అన్ని విషయాలు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఉన్న టీడీపీలో ఉన్న నేతలు కొంతమంది టీఆర్ఎస్తో సంబంధాలు పెట్టుకుని ఏ రకంగా లాభాలు పొందింది కూడా వివరాలు వెల్లడించినట్టు తెలిసింది. అయితే ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్కు బాబు అభయం ఇచ్చినట్టు సమాచారం.