Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓంకార్ భవన్ ప్రారంభోత్సవ సభలో వక్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బలమైన ఐక్య ఉద్యమాలు నిర్మించడం ద్వారానే దేశంలో వామపక్షాలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని వామపక్షాల నేతలు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగా అనేక దుష్పరిణామాలు తలెత్తుతున్నాయ న్నారు. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మతాల మధ్య చీలికలు తెచ్చి పబ్బగడుపుకుం టుందని, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తోం దన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టుల ను ఆ పార్టీ శత్రువులుగా భావిస్తోందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధు లు, మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ 9వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో ఆయన పేరు మీద నిర్మించిన 'ఓంకార్ భవన్' ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యాలయ భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ భవన్ను ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్ ప్రారంభించారు. బీఎన్రెడ్డి హాల్ను రిటైర్డ్ జడ్డి బి చంద్రకుమార్, ప్రజా సంఘాల కార్యాల యాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ అధ్యక్షతన బహిరంగసభ జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి మాట్లాడుతూ ఓంకార్, బీఎన్ రెడ్డి ఇద్దరూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించారని చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమానికి వారు చేసిన సేవలు మరవలేవని కొనియాడారు. ఓంకార్ ఆఖరి దశలోనూ వారు వామపక్షాల ఐక్యత కోసం ఎంతో కృషి చేశారన్నారు. వామపక్ష పార్టీల నాయకులు ప్రజా ఉద్యమాలకు పునరంకితం కావాలన్నారు. సంఘపరివార్ శక్తులు కేరళ, త్రిపుర రాష్ట్రాల వామపక్ష ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నా యన్నారు. సంఘపరివార్ శక్తులు చేస్తున్న దాడి ఒక సీపీఐ(ఎం) మీదనే కాదని మొత్తం వామపక్ష ఉద్యమంపై అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్థిక విధానాలు ప్రజలకు శత్రువుగా మారాయన్నారు. ఉద్యోగాలు, ఉపాధి, విద్యా, వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారిపోయాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింద న్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సమ రశీల పోరాటాలు చేయడం వల్లే వామపక్షాల మధ్య ఐక్యత మరింత బలపడుతుందన్నారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకంపై ఎంతో రాద్ధాంతం చేశారని, చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాల మధ్య ఐక్యత రావాలన్నారు. అందు కు కొత్త ఆశలు, కొత్త ఉత్సహంతో కొత్త మార్గం లో పయనించాల్సిన అవసరం ఉందని చెప్పా రు. ఐక్యత అని పైకి చెప్పడం కాకుండా ఆచర ణే గీటురాయిగా ఉండాలని సూచించారు. ఎంసీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి ఎండి గౌస్ మాట్లాడుతూ ఓంకార్ భవన్ కమ్యూనిస్టు ప్రజా ఉద్యమాలకు కేంద్ర బిందువు అవుతుం దని చెప్పారు. బీఎన్, ఓంకార్ మార్గంలోనే ఎంసీపీఐ(యూ) పయనిస్తోందన్నారు. వామ పక్షాల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ వాటిని చర్చల ద్వారా పరిష్కరించకుని ఐక్య ఉద్యమాలను నిర్మించాలని సూచించారు. రిటైర్డ్ జడ్జి బి చంద్రకుమార్ మాట్లాడుతూ నిస్వార్థ త్యాగనిరతి కలిగిన నేత ఓంకార్ అని కొనియాడారు. కమ్యూనిస్టులు ఐక్య ఉద్యమాల తో రాజ్యాధికారాన్ని సాధించాలని ఆకాంక్షిం చారు. సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్థిక అసమానతలు తారాస్థాయికి చేరాయన్నారు. వామపక్ష పార్టీలు ఓట్ల ద్వారా కాకుండా సమరశీల పోరాటాల ద్వారానే మార్పు సాధ్యమన్నారు.
సీపీఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) నేత కె.గోవర్థన్, ప్రజాగాయ కుడు గద్దర్, సీపీఐ (ఎంఎల్ న్యూడెమోక్రసీ) నేత గుర్రం విజయ కుమార్, ఎస్యూసీఐ నేత మురహరి, ఆర్ఎస్పీ కార్యదర్శి జనకిరాములు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, ఎంసీపీఐ(యూ) పొలిట్బ్యూరో సభ్యులు విజయ కుమార్ చౌదరి, మద్దికాయల అశోక్ ఓంకార్ చేసిన ఉద్యమలపై మాట్లా డారు. ప్రజాగాయకుడు గద్దర్ తన పాట ద్వారా కార్యకర్త లను ఉత్తేజపరించారు. ఇంకా కార్యక్రమంలో మద్దికాయల సుధాకర్, బీఎన్రెడ్డి కూతురు బి రాజేశ్వరీ, న్యాయవాది జిఎల్ నరసింహారావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి రాములు,సీపీఐ నేత కందిమల్ల ప్రతాపరెడ్డి, ప్రముఖ న్యాయవాది మల్లు కపోతంరెడ్డి, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర నాయకులు సాంబయ్య, పల్లెపు ఉపేందర్రెడ్డి, ఎల్ లింగారెడ్డి, వరికుప్పల వెంకన్న, వనం సుధాకర్, సబ్బని కృష్ణ మాట్లాడారు.