Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి: తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్
- సీఎస్కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించిన తర్వాతనే గ్రామపంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ధర్మానాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం శోభన్ నాయక్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గత 25 ఏండ్లుగా తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చాలంటూ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చింది. కాని పార్టీ అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అవుతున్నా నేటికి ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. తండాల్లో తాగు నీటి సౌకర్యం, విద్యుత్తు, డ్రైనేజీ, విద్య, వైద్యం అందడం లేదని తెలిపారు. తండా వాసులు పడుతున్న కష్టాలను గుర్తించి గిరిజన తండాలను వెంటనే గ్రామపంచాయతీలుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఎం ధర్మానాయక్ మాట్లాడుతూ గిరిజన తండాలు కనీస మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక గ్రామ పంచాయితీ కింద 6నుండి 19 తండాలు ఉన్నాయని, రేషన్ షాపులకు వెళ్లాలన్న రెండు కిలోమీటర్లు నడువాల్సి వస్తుందన్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తించేందుకు 2004లోనే ఉత్తర్వులు జారీ చేసినా ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం శోచనీయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా గిరిజనులను తీవ్ర వేదింపులకు గురి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.