Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూత్వం, సామ్రాజ్యవాదం.. ఈ రెండింటి కలయికతోనే ప్రమాదం
- వీటితో వ్యక్తులు, వ్యవస్థ చిన్నాభిన్నం
- ప్రజల జీవితాల్లో ఆందోళన, అభద్రత పెరిగాయి
- సామాజిక న్యాయం, సమానత్వం సాధించాలంటే వామపక్ష ఉద్యమం సంఘటితం కావాలి
- మహాజన పాదయాత్ర వార్షికోత్సవ సభలో ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హిందూ మతోన్మాదం, సామ్రాజ్యవాదమనేవి ఇప్పుడు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలని పౌర హక్కుల ఉద్యమ జాతీయ నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. ఈ రెండింటి కలయిక వల్ల ఉద్భవించిన సరళీకరణ విధానాలనేవి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయని తెలిపారు. వీటి ఫలితంగా వ్యక్తిగత జీవితం, వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ రంగాలు, తరగతులకు చెందిన ప్రజలు తమ జీవితాల్లో ప్రతి నిత్యం అభద్రతకు, ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇలాంటి విధానాలను తిప్పికొట్టకుండా దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం సాధ్యం కాదని చెప్పారు. వీటిని సాధించాలంటే ముందు దేశంలోని వామపక్ష ఉద్యమం సంఘటితం కావాలని నొక్కి చెప్పారు. 'సామాజిక న్యాయం-రాష్ట్ర సమగ్రాభివృద్ధి' అనే నినాదంతో సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాజన పాదయాత్ర ప్రారంభానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'సరళీకృత ఆర్థిక విధానాలు-సామాజిక తరగతులపై ప్రభావం' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో హరగోపాల్తోపాటు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, ప్రజా యుద్ధనౌక గద్దర్, పాదయాత్ర సారధి తమ్మినేని వీరభద్రం, సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రసంగించారు.
హరగోపాల్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చాలి, ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలి, ఇండియాకు ప్రజాస్వామ్యమనేది ఎంతమాత్రమూ పనికిరాదనే విధంగా మతోన్మాద శక్తులు వ్యాఖ్యానించటం అత్యంత ఆందోళనకరమని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత ఇదే మోడీ ప్రభుత్వం ఇప్పటి మెజారిటీతోనే గద్దెనెక్కితే.. వీటిని కచ్చితంగా అమలు చేసి తీరుతుందని హెచ్చరించారు. ఇలాంటి ప్రమాద ఘంటికల గురించి ఆలోచించాలని వామపక్షాలకు, ప్రజాతంత్ర శక్తులకు సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామిక విలువలు, సామాజిక న్యాయం, సమభావం, ఆర్థిక సమానత్వం, అంతరాలు తగ్గించమనే అంశాలు... బీజేపీకీ, ఆరెస్సెస్కు అసలే మింగుడు పడని పదాలని చెప్పారు.
పొద్దున లేస్తే జాతీయవాదం గురించి, దేశభక్తి గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. మన రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారని ఎద్దేవా చేశారు. జాతీయ వాదమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ఇలాంటి అతి ప్రధానమైన అంశాల్లో హిందూత్వ శక్తులకు విదేశీయత కనబడదు.. కానీ వాలెంటైన్స్ డే, పిజ్జాలు, బర్గర్ల వంటి వాటిల్లో మాత్రం విదేశీ సంస్కృతి కనబడుతున్నదని ఎద్దేవా చేశారు. మరోవైపు ఎన్డీయే పాలనలో శరవేగంగా అమలవుతున్న సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా.. ప్రజల జీవితాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో తీవ్రమైన అభద్రత నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాదయాత్ర బృంద సభ్యులు ఎమ్వీ రమణ, ఎస్.రమ, ఎమ్డీ అబ్బాస్, పి.ఆశయ్య, శోభన్ నాయక్, నగేశ్, నైతం రాజు, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, జి.రాములు, హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎమ్.శ్రీనివాస్, సౌత్ కార్యదర్శి ఎమ్.సోమయ్య, మేడ్చల్ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.
వివక్ష, దోపిడీపై జమిలీ పోరాటాలు: కాకి మాధవరావు
''ప్రస్తుతం మనం ప్రజలెదుర్కొంటున్న కుల వివక్ష, ఆర్థిక దోపిడీపై జమిలీ పోరాటాలు నిర్వహించాలి. కుల వివక్ష అనేది మన దేశంలో ఒక క్రూర జంతువు. దాన్ని అడ్రస్ చేయకుండా సామాజిక న్యాయాన్ని సాధించలేం. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలు ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలన్నింటినీ పొంది.. లాభాలు గడిస్తున్నాయి. కానీ ఆ ప్రతిఫలంలో వివిధ సామాజిక తరగతులకు వాటా దక్కటం లేదు. అందుకే ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కీలకం...''
ఎన్నేండ్లయినా పోరాడతాం:తమ్మినేని
''రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించేదాకా పోరాడతాం. ఇందుకోసం ఎన్నాళ్లయినా, ఎన్నేండ్లయినా ఉద్యమిస్తాం. రాష్ట్రంలోను, దేశంలోనూ కులాన్ని విస్మరిస్తే వర్గపోరాటం సాధ్యం కాదనే విషయం అనుభవపూర్వకంగా తేలింది. సామాజిక న్యాయం సాధించేందుకోసం రాబోయే రోజుల్లో విస్తృత ఐక్య కార్యాచరణ అవసరం. ఆ కర్తవ్యాన్ని ముందుకు తీసుకుపోవాలి...''
సామాజిక న్యాయమనేది ఒక రాజకీయ సమస్య :గద్దర్
''ప్రత్యేక తెలంగాణ అనేది ఒక రాజకీయ సమస్య. అదే విధంగా సామాజిక తెలంగాణ అనే అంశం కూడా ఒక రాజకీయ సమస్యే. పాదయాత్ర ద్వారా మార్క్సిస్టు పార్టీ మాస్లైన్ (ప్రజల వద్దకు వెళ్లటం)కు దారి వేసింది. దానికి మరో ముందడుగే టీ మాస్. మహజన పాదయాత్ర కమ్యూనిస్టు పార్టీల్లోనే ఒక విస్తృతమైన చర్చకు దారి తీసింది...''
మా సభ్యుల సంకల్పం అమోఘం...
బృంద సభ్యులకు అభినందనలు
పాదయాత్ర బృందంలోని సభ్యులందర్నీ తమ్మినేని ఈ సందర్భంగా అభినందించారు. ప్రభుత్వ హెచ్చరికలు, ఆరోగ్య సమస్యలను లెక్కచేయక వారు అకుంఠిత దీక్షతో పాదయాత్రను పూర్తి చేశారని తెలిపారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోపాటు ప్రజల ఆశీర్వాదాలు, అండదండలతో వారు లక్ష్యాన్ని పూర్తి చేశారని చెప్పారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నామనే ఒక గొప్ప రాజకీయ సంకల్పబలమే తనను, తన టీంలోని సభ్యులను చివరిదాకా నడిపించిందని తెలిపారు.