Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టులు, పరిశ్రమలకు వామపక్షాలు అడ్డు కాదు: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- మల్లన్నసాగర్పై చర్చకు సర్కారు సిద్ధమా? : కోదండరామ్
- భూములకు మార్కెట్ విలువ కట్టి గ్రామసభ నిర్వహించాలి: వెంకట్
- 500వ రోజుకు వేములఘాట్ దీక్షలు
నవతెలంగాణ-తొగుట
'ప్రాజెక్టులకు, పరిశ్రమలకు భూ నిర్వాసితులు, వామపక్షాలు అడ్డుకావు. ప్రాజెక్టులకు ముందు రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో, ప్రాజెక్టుల్లో భూములు ముంపునకు గురైన తర్వాత కూడా అంతే సంతోషంగా ఉండాలి. అలాగైతేనే రైతులు స్వచ్ఛందంగా భూములిస్తారు. ఇది రాజకీయ పోరాటం కాదు. భూమి కోల్పోతున్న ప్రతి రైతు గుండెలోంచి పుట్టుకొస్తున్న ఆవేదన. ప్రభుత్వం ఇప్పటికే అక్రమంగా సేకరించిన భూములనూ వేములఘాట్ పోరాటంతో వెళ్లగక్కిస్తాం. పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు నిర్వాసితుల వీరోచిత పోరు కొనసాగుతుంది. వారికి మేమంతా అండగా ఉంటాం...' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కొమురవెళ్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ నిర్వాసితుల రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో 500వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షలను తమ్మినేని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం కాదని ప్రభుత్వం జీఓ నెంబర్ 123 తెచ్చి తప్పు చేసిందన్నారు. దీన్ని రద్దు చేస్తూ హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులిచ్చినా ప్రభుత్వం మేల్కోకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాలను కాజేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. నిర్వాసితులకు అండగా ఉంటూ భూములను లాక్కోకుండా అడ్డుకుంటామని చెప్పారు. డీపీఆర్, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చిన తర్వాతే వేములఘాట్ గ్రామంలో గ్రామసభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకుని, సోషల్ మీడియాను వాడుకుంటూ, ఈ నెల 21 ప్రభుత్వం నిర్వహించే గ్రామసభను అన్ని ఛానళ్లలో లైవ్ టెలికాస్ట్ చేసి ప్రభుత్వ తీరును బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు. వేములఘాట్ పోరాట వీరుల స్ఫూర్తితోనే మహాజన పాదయాత్రను పూర్తి చేసుకున్నట్టు చెప్పారు. జేఏసీ చైర్మెన్, ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ వేములఘాట్ పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వేములఘాట్కు సర్కారు ఇంజినీర్లతో వస్తే తామూ తమ ఇంజినీర్లతో వస్తామని, అక్కడ మల్లన్నసాగర్పై చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సర్కారు ఆకృత్యాలను వేములఘాట్ రైతులు ఎత్తి చూపారని, రైతులది ఆత్మగౌరవ పోరాటమని అన్నారు. మల్లన్నసాగర్ విషయంలో చెంబెడు నీటి కోసం డ్రమ్ము కొన్న చందంగా సర్కారు తీరు ఉందన్నారు. భూ నిర్వాసితుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ బి.వెంకట్ మాట్లాడుతూ..మార్కెట్ రేటును రివైజ్ చేసిన తర్వాతే గ్రామసభలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకే : దామోదర
మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ...ప్రభుత్వ తప్పులను నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు. టీఆర్ఎస్ సర్కార్ కమీషన్ల కోసం కక్కుర్తి పడి పాలన సాగిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేయాలని ఎన్జీటీ చెప్పినా సర్కారు మొండిగా ముందుకెళ్తోందన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామా అని ఎద్దేవా చేశారు. వేములఘాట్ నిర్వాసితులకు అండగా తామంతా ఉంటామన్నారు. సభలో కళాకారుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మాజీ మంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, చెరుకు ముత్యంరెడ్డి, సీపీఐ(ఎం) మెదక్, సిద్దిపేట జిల్లాల కార్యదర్శులు ఎ.మల్లేశం, ఆముదాల మల్లారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు వంటేరు ప్రతాప్రెడ్డి, నిర్వాసితులు హైయతొద్దిన్, శ్రీనివాస్రెడ్డి, మల్లారెడ్డి, ఎల్లంరెడ్డి, రంగారెడ్డి, తిరుపతి, కనకయ్య పాల్గొన్నారు.