Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనాల కోసం కమిషనరేట్ ముట్టడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమస్యల పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ కార్మికులు ఈనెల 20న చలో హైదరాబాద్ నిర్వహించనున్నట్టు తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షలు పాలడుగు భాస్కర్, అధ్యక్షులు పి.గణపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఐ.శ్రీపతిరావు తెలిపారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని, వేతనాలు పెంచి, చెల్లింపులకు ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించాలని, గత సమ్మె సందర్భంగా యూనియన్తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఓప్పందాలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో 20న హైదరాబాద్లోని హిమాయత్నగర్లో ఉన్న పంచాయతీరాజ్ కమిషనరేట్ను ముట్టడించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఉద్యోగ కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పంచాయతీరాజ్చట్టంలో గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల వేతనాలకు కూడా బడ్జెట్ కేటాయించాలని కోరారు. వచ్చే బడ్జెట్లో జనాభా ఆధారంగా ఒక్కొక్క గ్రామపంచాయతీకి రూ. 10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పారని వివరించారు. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తామని కూడా అన్నారని తెలిపారు. సర్కారుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కార్మికుల కడుపుకొడుతున్న నిబంధనలు, జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ. 18 వేలకు తగ్గకుండా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి వేతనాలు చెల్లించాలని చెప్పారు. ఈమేరకు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.