Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెలాఖరులో ఇస్తారన్న డిప్యూటీసీఎం
- సాధ్యం కాదంటున్న కమిటీ సభ్యులు!
- త్వరలో వారం పాటు ప్రయివేటు బడుల పరిశీలన
- విద్యాసంవత్సరం చివర్లోనే నివేదిక..!
- ప్రయివేటులో ఫీజు నియంత్రణపై నీలినీడలు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం వేసిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదిక ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. కమిటీ తీసుకున్న గడువు ప్రకారం ఈనెలాఖరులో ఇవ్వాల్సి ఉన్నది. ఇటీవల అసెంబ్లీలోనూ డిప్యూటీసీఎం కడియం శ్రీహరి కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. కానీ ఇది సాధ్యం అయ్యేలా పరిస్థితులు కనిపించడం లేదు. ఈ విద్యాసంవత్సరం చివరి నాటికి నివేదిక అందించేందుకు కమిటీ ప్రయత్నిస్తున్నది. రాష్ట్రంలోని సుమారు 12వేల ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు గత విద్యాసంవత్సరం మార్చి నెలలో ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో 14 మందితో తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. ఏప్రిల్లో 23లోగా ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందించాలని పేర్కొన్నది. తల్లిదండ్రులు, యాజమాన్యాలతో పలుమార్లు సమావేశమైన కమిటీ, పూర్తిస్థాయి అధ్యాయనం కోసం గడువు కోరింది. మే 23 నాటికీ, జూన్ చివరికీ, మరో నెల రోజులు.. ఇలా పలుమార్లు ప్రభుత్వం నుంచి గడువు తీసుకుంటూ, చివరికి నవంబర్ 17వరకు ఫీజుల నివేదిక అందిస్తామని ప్రకటించింది. ఈక్రమంలోనే డిప్యూటీసీఎం కడియం శ్రీహరి ఇటీవల అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. ప్రయివేటు, కార్పొరేట్ బడుల్లో ఫీజుల నియంత్రణ కోసం వేసిన తిరుపతిరావు కమిటీ ఈనెలాఖరులోగా నివేదిక ఇస్తుందనీ, దాని ఆధారంగా రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చేస్తామని ప్రకటించారు. కానీ నివేదిక ఈనెలాఖరుకూ వచ్చేలా కనిపించడం లేదు.
ఫీజుల వివరాలు సేకరించడంలో ఆలస్యం
రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలలు గడిచిన రెండేండ్ల ఆదాయ, వ్యయాలతో పాటు ఈ విద్యాసంవత్సరం వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను ఇవ్వాలని విద్యాశాఖ ద్వారా తిరుపతిరావు కమిటీ యాజమాన్యాలను కోరింది. మూడు సార్లు గడువు పెంచినా యాజమాన్యాలు మాత్రం పెద్దగా స్పందించలేదు. 12వేల పాఠశాలలకు గానూ వివరాలు ఇచ్చింది కేవలం 4090 బడులే. రాష్ట్రంలోని మొత్తం బడుల్లో మూడోవంతుకు పైగా పాఠశాలలున్న గ్రేటర్ హైదరాబాద్లో 15శాతం స్కూల్స్ కూడా సమాచారమి వ్వలేదు. ప్రస్తుతం వచ్చిన ఈ వివరాలను విశ్లేషణ కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)కు అప్పగించారు. ఆ నివేదికను ఆధారం చేసుకుని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన వివరాలను పరిశీలించి, పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే ఆలోచనలో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఉన్నది.
బడులు పరిశీలించే యోచన..
ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో వసూలు చేసిన, చేస్తున్న ఫీజుల వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు తిరుపతిరావు కమిటీ త్వరలో వారం రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించనున్నది. ఈ సందర్భంగా ఫీజుల వివరాలిచ్చిన బడులతో పాటు ఇవ్వని స్కూల్స్లోనూ ఆదాయ, వ్యయాలు, ఫీజుల వివరాలను పరిశీలించనున్నది. ఇప్పటికే ఫీజుల వివరాలిచ్చిన బడులు ఇచ్చిన లెక్కలు సరైనవేనా లేక తప్పుడు లెక్కలు ఇచ్చారా అనే విషయాన్ని కూడా కమిటీ సభ్యులు పరిశీలిం చనున్నారు. అయితే ఈ తనిఖీలకు యాజమా న్యాలు ఎంతమేరకు సహకరిస్తాయనేది వేచిచూ డాల్సిందే. వీటన్నింటి ఆధారంగా ఈ విద్యాసంవత్సరం ఆఖరు లోగా(మార్చి) పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పూర్తి వివరాలతోనే నివేదిక
ప్రయివేటు బడుల్లో ఫీజుల నియంత్రణ కోసం కమిటీ ప్రయత్నిస్తున్నది. దీనిలో భాగంగా ఎలాంటి న్యాయపర మైన చిక్కులు లేకుండా పకడ్బందీగా నివేదికను తయారు చేస్తున్నాం. వివరాలు ఇచ్చిన పాఠశాలల ఫీజులపై విశ్లేషణ జరుగుతున్నది. వాటి ఆధారంగా కొన్ని బడుల్లో కమిటీ త్వరలో ప్రత్యక్షంగా పరిశీలించనున్నది. ఆ తర్వాతే పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందిస్తాం. నివేదిక ఇచ్చేందుకు సమయం ఎంత పడుతుందనేది చెప్పలేం.
ప్రొ.తిరుపతిరావు, ఫీజుల నియంత్రణ కమిటీ చైర్మెన్