Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాగున్న హోటళ్లలో భారీ ధరలు
- బెంబేలెత్తుతున్న ప్రజలు
- ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో 30కి 23 ఖాళీ
- హైకోర్టు ఆదేశించినా భర్తీపై మీనమేషాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కవితకేదీ అనర్హం... అన్నట్టుగా కల్తీకేదీ అనర్హం అన్న చందంగా ఉంది పరిస్థితి. ఎక్కడ చూసినా కల్తీ...కల్తీ...కల్తీ. పాలు మొదలుకొని స్టార్ హోటళ్లలో ఆహార పదార్థాల వరకు కల్తీయమం. కూరగాయలు, పండ్లు, మాంసం, వంటనూనె, తినుబండారాలు ఇలా ప్రతిదీ కల్తీ అవుతున్నది. దీంతో ఏం తినాలో... ఏం తినకూడదో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ప్రజలున్నారంటే అతిశయోక్తి కాదు. కల్తీ ఆహార పదార్థాలపై హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కార్బైడ్ వాడి మామిడిపండ్లు, ఇతర పండ్లను మాగబెట్టడాన్ని సుమోటోగా స్వీకరించింది. కార్బైడ్ వాడితే కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కల్తీ ఆహార పదార్థాలపై పర్యవేక్షణకు ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని కోరింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 2016, ఆగస్టు 29న జీవో నెంబర్ 102 ద్వారా 10 ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు మొత్తం 21 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీవో వచ్చి 15 నెలలైనా భర్తీ కాలేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతున్నది. రాష్ట్రంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 30 ఉండగా, 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఏడుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలను నియంత్రించడం, నాణ్యతాప్రమాణాలుండే ఆహారాన్ని ప్రజ లకు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతున్నది. కల్తీపై పర్యవేక్షణను పూర్తిగా గాలికొదిలేసిందని ప్రభుత్వ తీరును బట్టి తెలుస్తున్నది.
హైదరాబాద్లో కోటి మందికి నలుగురే ఫుడ్ ఇన్స్పెక్టర్లు
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని అభివృ ద్ధి చేస్తామని నిత్యం సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటనలు చేస్తారు. అంతర్జాతీయ స్థాయి ఉన్న హోటళ్లు హైదరాబాద్లో ఉన్నాయి. అంతర్జాతీయ సమావేశాలకు హైదరాబాద్ వేదికైంది. నగరంలో కోటి మంది జనాభా ఉన్నారు. 20 వేల వరకు ఆహార పదార్థాలను అందించే హోటళ్లున్నాయి. కానీ హైదరాబాద్లో ఆహార పదార్థాల నాణ్యతను పర్యవేక్షించే ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాత్రం నలుగురే ఉండడం గమనార్హం. ఇక మిగిలిన 30 జిల్లాల్లో ముగ్గురే ఫుడ్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. అంటే పది జిల్లాలకు ఒకరు చొప్పున ఉన్నారు. ఆహార పదార్థాల నాణ్య తా పర్యవేక్షణ ఏం జరుగుతుందో పాలకులే అర్థం చేసు కోవాలి. జంతు కళేబరాలతో వంటనూనె వినియోగిస్తు న్నారని, కుక్క మాంసం వండుతున్నారని శంషాబాద్లో ఓ హోటల్పై ఆరోపణలొచ్చాయి. మేక, గొర్రె మాంసం పేరు చెప్పి కొన్ని హోటళ్లలో బీఫ్ వడ్డీస్తున్నారని, ఒకటి రెండు రోజులు నిల్వ చేసిన ఆహార పదార్థాలను, పాడైపోయిన మాంసం వేడి చేసి పెడుతున్నారని కోకొల్లలుగా ఆరోపణలు వచ్చాయి. కొన్ని హోటళ్లను తనిఖీ చేస్తే నిజాలు బయట పడ్డాయి. కల్తీ ఆహార పదార్థాలు రావడం వల్ల ప్రజలు బెంబే లెత్తుతున్నారు. హోటళ్లకు వెళ్లి తినాలంటేనే భయపడుతు న్నారు. కొన్ని స్టార్ హోటళ్లలో ఆహార పదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలున్నా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు ఎక్కువున్నా ప్రజలు అక్కడే తినేందుకు ఆసక్తి చూపుతు న్నారు. తక్కువ ధరకు వచ్చే హోటళ్లలో తిని అనారోగ్యం తెచ్చుకోవడం కన్నా ఎక్కువ ధర అయినా నాణ్యత ఉండే ఆహార పదార్థాలను తినడానికే మొగ్గుచూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ)లో 26 ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టులతోపాటు 200 టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2017, మే 23న జీవో నెంబర్ 90 విడుదల చేసింది. అయినా ఆ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) విభాగంలో 569 పోస్టులుంటే 324 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐపీ ఎంలో 245 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరి స్తున్నది. పోస్టులు ఎప్పుడు భర్తీ అవుతాయోనని నిరుద్యోగు లు ఎదురుచూస్తున్నారు. టీఎస్పీఎస్సీ తక్షణమే నోటిఫికేష న్లు విడుదల చేయాలని కోరుతున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లపై ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇటీవల శాసనమండలిలో స్పందిస్తూ... మొత్తం 30 పోస్టులకుగాను 23 ఖాళీగా ఉన్నా యని చెప్పారు. వాటిలో పది ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామన్నారు. మిగిలిన 13 పోస్టుల భర్తీ ప్రక్రి యకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కల్తీ ఆహార పదా ర్థాలు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పర్యవేక్షణ అధికారుల్లేకుండా నాణ్యమైన ఆహార పదార్థాలను ఎలా అందిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.