Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) శాసనసభాపక్ష నేత సున్నం రాజయ్య
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనను సీపీఐ(ఎం) స్వాగతిస్తున్నదనీ, కానీ విభజన అశాస్త్రీయంగా జరిగిందని సీపీఐ(ఎం) శాసనసభాపక్ష నేత సున్నం రాజయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్, మేడ్చెల్ లాంటి జిల్లాలు 35లక్షల జనాభా, సిరిసిల్లా, జనగామ లాంటి జిల్లాల్లో నాలుగైదు లక్షల జనాభా ఉన్నదని తెలిపారు. ఏ విధంగా విభజన చేశారో స్పష్టత లేదన్నారు. డీఆర్డీఏ, డ్వామా వేర్వేరు శాఖలనీ, కానీ ప్రస్తుతం ఒక్కటి చేయడంతో అనేక సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఉద్యోగులంతా స్వంత జిల్లాలను వదిలి విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. భద్రాచలం ఏజెన్సీని ప్రత్యేకంగా జిల్లా చేయాలని కోరారు. నూతన కలెక్టరేట్లు ప్రజలకు అనువైన స్థలంలోనే నిర్మించాలని కోరారు.
ఏ ప్రాతిపాదికన విభజించారు: సంపత్
24 జిల్లాల కోసం డ్రాఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత 31 జిల్లాలను ప్రకటించారనీ ఇది ఏ ప్రాతిపదికన నిర్ణయించారో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ డిమాండ్ చేశారు. జిల్లాల విభజనపై అన్ని పార్టీలతో ఒక్కసారి మాత్రమే సమావేశం నిర్వహించారనీ, దీనిలో వచ్చిన సందేహాలను నివృత్తి ఎలా చేశారో చెప్పాలన్నారు. అన్ని జిల్లాలను విభజించి కేవలం హైదరాబాద్ను మాత్రమే విభజన చేయలేదనీ, దీంతో విభజన ఎంఐఎం కనుసన్నుల్లోనే జరిగినట్టు స్పష్టమవుతుందని చెప్పారు. కల్వకుర్తి డివిజన్ కోసం ఎమ్మెల్యే దీక్ష చేసినా స్పందించలేదన్నారు. 31 జిల్లాల పేరుతో టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తే పది జిల్లాలతోనే పరీక్ష నిర్వహించాలనీ హైకోర్టు ఆదేశాలిచ్చిందన్నారు.
రాజకీయ ఒత్తిళ్లతోనే జిల్లాల ఏర్పాటు: కిషన్రెడ్డి
పాలన వికేంద్రీకరణకు బీజేపీ అనుకూలమని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్రెడ్డి తెలిపారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే జిల్లాలు, డివిజన్లు, మండలాల విభజన జరిగినట్టు తెలుస్తుందని చెప్పారు. జిల్లాల విభజన జరిగి 14నెలలు కావస్తున్న నేటికీ పూర్తిస్థాయిలో అధికారుల నియామకం జరగలేదన్నారు. పాలకుర్తి, మునుగోడు ఎమ్మెల్యే నియోజకవర్గాలు మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులకు జనరల్ ట్రాన్స్ఫర్స్్ ఇచ్చి బదిలీలు నిర్వహించాలని కోరారు.
ఊరిబయట కడితే ఏం ఉపయోగం.?: సండ్ర వెంకటవీరయ్య
కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్లు ఊరిబయట కడితే ఉపయోగం లేదని, ప్రజల అందుబాటులో ఉండే చోటనే నిర్మించాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. ఒక జిల్లాలో 40లక్షల జనాభా, మరో జిల్లాలో నాలుగు లక్షల జనాభా ఉందని, ఇది ఏ ప్రాతిపదికన చేశారో చెప్పాలని కోరారు. చాలాచోట్ల జిల్లాలు, డివిజన్లు, మండలాలు కావాలని ఆందోళనలు చేస్తున్నారని, అవకాశముంటే వాటిని పరిశీలించాలని కోరారు. సచివాలయంలో గ్రీవెన్స్సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల వద్దకు పాలన: బాలకిషన్
పాలన ప్రతి వ్యక్తి వద్దకు చేరాలనే జిల్లాల పునర్ విభజన జరిగిందని టీఆర్ఎస్ సభ్యులు రసమయి బాలకిషన్ అభిప్రాయపడ్డారు. ఇదువరకు సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు ప్రజలు పోయేదనీ, ప్రస్తుతం సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల వద్దకే అధికారులు పోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో పోలీసింగ్ వ్యవస్థలో సంస్కరణలతో నేరాల సంఖ్య సగానికి తగ్గిపోయిందని అన్నారు. చర్లపల్లి జైలుకు టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు.
మంచి నిర్ణయం: జాఫర్ హుస్సేన్
జిల్లాల విభజన మంచి పరిణామమని ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నదని అన్నారు. రూ.1337 కోట్లతో నూతన భవనాలు నిర్మించడంతో ప్రజలకు పాలన మరింత చేరువవుతు ందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుకు జిల్లాల విభజన ఉపయోగపడుతుందని తెలిపారు.