Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాం: మండలిలో మంత్రి ఈటల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వారంరోజుల్లో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లకు ఐఏఎస్ అధికారులను నియమిస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. శుక్రవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీడీఏల సమస్యల అంశాన్ని టీఆర్ఎస్ సభ్యుడు రాములు నాయక్ లేవనెత్తారు. గిరిజన తండాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రోడ్లు సరిగ్గా లేవని, తాగునీరు అందడం లేదని చెప్పారు. కేటాయించిన నిధులూ ఖర్చు కావడం లేదని అన్నారు. దీనిపై మంత్రి ఈటల రాజేందర్ సమాధానమిస్తూ... గిరిజనులు, ఐటీడీఏల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఏటూరు నాగారం, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏలున్నాయని అన్నారు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం హైదరాబాద్లో, నాగర్కర్నూల్ జిల్లాలోని మన్ననూర్లో ఐటీడీఏలున్నాయని వివరించారు. రాష్ట్రంలో 31.72 లక్షల మంది గిరిజనులున్నారని, 15 లక్షల మంది మైదానాల్లో నివసిస్తున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీఏల్లో 15 మంది అధికారులుంటే, ఏపీకి 10 మంది, తెలంగాణకు ఐదు మంది విభజించబడ్డారని చెప్పారు. ప్రాజెక్టు అధికారి పోస్టు ఏపీకి వెళ్లిందన్నారు. గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని అన్నారు. గిరిజన తండాలు, గూడేల్లో రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని చెప్పారు. ఆరు లేదా ఎనిమిది నెలల్లో ఆ పనులన్నీ పూర్తవుతాయని అన్నారు. గిరిజన సలహా మండలిని నియమిస్తామని చెప్పారు.
తాటి, ఈత చెట్లపై పన్ను రద్దు : పద్మారావుగౌడ్
తాటి, ఈత చెట్లపై ఉన్న పన్ను రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ ప్రకటించారు. ప్రస్తుతం ఒక్కో చెట్టుకు పట్టణాల్లో రూ.50, గ్రామీణ ప్రాంతాల్లో రూ.25 పన్ను చెల్లించాల్సి ఉందన్నారు. సమగ్ర కల్లు విధానం రూపొందించాలని టీఆర్ఎస్ సభ్యులు గంగాధర్గౌడ్ చెప్పారు. గీత కార్మికులకు శాశ్వత లైసెన్స్ ఇవ్వాలని కోరారు. రూ.20 కోట్లతో గౌడ భవన్ నిర్మించాలని, సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్బండ్పై పెట్టాలని సూచించారు. చెట్లు ఎక్కేందుకు యంత్రాలు ఇవ్వాలని భానుప్రసాద్ చెప్పారు. కల్లును ఆబ్కారీ శాఖ నుంచి పౌరసరఫరాల శాఖకు మార్చాలని బాలసాని లక్ష్మీనారాయణ సూచించారు. ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లను నాటాలని నారదాసు లక్ష్మణరావు చెప్పారు. మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాములు నాయక్ అన్నారు. పొంగులేటి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ కల్తీ కల్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి పద్మారావుగౌడ్ సమాధానమిస్తూ... కేరళ, తమిళనాడులో చెట్లు ఎక్కే యంత్రాలను అధికారుల బృందం పరిశీలించిందని చెప్పారు. కొబ్బరిచెట్లు ఎక్కేందుకు వాడుతున్నారని అన్నారు. ఇక్కడ తాటి చెట్లు ఎక్కేందుకు ఎంత మేరకు పనికొస్తాయన్నది పరిశీలించాల్సి ఉందన్నారు. ఉపయోగకరంగా ఉంటే సీఎం చేతులమీదుగా సొసైటీలకు ఉచితంగా ఇస్తామని చెప్పారు. గీత కార్మికులు ప్రస్తుతం ఐదేండ్లకోసారి లైసెన్స్లు పునరుద్ధరించుకోవాలని అన్నారు. శాశ్వత లైసెన్స్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. తాటి, ఈత చెట్లను నరకడం నేరమని అన్నారు. నరికితే కేసులు పెడతామని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చెప్పారు. గీత కార్మికులందరికీ సొసైటీల్లో సభ్యత్వం ఇవ్వాలని కోరారు. మద్యం షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించబోమని స్పష్టం చేశారు.
కార్మికులకు కనీస వేతనాలివ్వండి : రాములు నాయక్
కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని టీఆర్ఎస్ సభ్యుడు రాములు నాయక్ డిమాండ్ చేశారు. మూడేండ్లకోసారి కార్మికులకు కనీస వేతనాలు మారాల్సి ఉందన్నారు. ఐదేండ్లయినా కనీస వేతనాలు పెరగలేదని చెప్పారు. కార్మిక మంత్రి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కనీస వేతన సలహా మండలిని ఏర్పాటు చేశామన్నారు. సలహా మండలి సూచనలు ప్రభుత్వానికి పంపిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
31 జిల్లాల్లో పనిచేస్తున్న షీటీంలు : నాయిని
బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీంలు 31 జిల్లాల్లోనూ పనిచేస్తున్నాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. 2014, డిసెంబర్ 23న హైదరాబాద్లో, 2015, ఏప్రిల్ ఒకటిన ఉమ్మడి జిల్లాల్లో షీటీంలను ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,744 ఈవ్టీజింగ్ కేసులు నమోదు చేశామని చెప్పారు. తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ ఇస్తామని అన్నారు. అయినా మారకుండా ఈవ్టీజింగ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని చెప్పారు. కౌన్సిలింగ్ ద్వారా ప్రవర్తనలో మార్పు వస్తోందన్నారు. 20 శాతం కేసులు తగ్గాయని అన్నారు. రాజస్థాన్, మహారాష్ట్రలో అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. షీటీంలను పర్యవేక్షించే అధికారి స్వాతిలక్రాకు అమెరికాలో అవార్డు దక్కిందన్నారు.
పాత జిల్లా కేంద్రాల్లో వెల్నెస్ కేంద్రాలు ప్రారంభించాలి : పాతూరి
రాష్ట్రంలో పాత జిల్లా కేంద్రాల్లోనూ వెల్నెస్ కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్రెడ్డి కోరారు. ఉద్యోగులు, పింఛనర్లు, జర్నలిస్టుల కోసం ఖైరతాబాద్, వనస్థలిపురంలో ప్రారంభించిన వెల్నెస్ కేంద్రాలు సమర్థంగా పనిచేస్తున్నాయని చెప్పారు. రెండే ఉండడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు.
'రిజిస్ట్రేషన్లు ఆపాలని ఉత్తర్వులివ్వలేదు':మహమూద్ అలీ
భూ రిజిస్ట్రేషన్లు ఆపాలని ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ప్రస్తుతానికి సర్క్యులేషన్ లో ఉన్న ప్రస్తుత పట్టాదారు పాస్పుస్తకాలు, టైటిల్డీడ్ల అమల్లో ఉన్నాయని అన్నారు. ఆర్ఓఆర్ చట్టానికి చేసిన సవరణ ప్రకారం కొత్త ఈ పాస్పుస్తకం, టైటిల్డీడ్ను పట్టాదారులకు త్వరలో జారీ చేస్తామన్నారు. చాలా బ్యాంకుల్లో నకిలీ పాస్పుస్తకా లున్నాయని చెప్పారు. వాటిని ఏరివేసేందుకు పక్కా ప్రణాళికతో కొత్త ఈ పాస్పుస్తకాలు జారీ చేస్తామన్నారు.