Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత కిసాన్ కో ఆర్డినేషన్ కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతుల రుణాలన్నింటినీ రద్దు చేయాలని, పండించిన పంటకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు మద్ధతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20,21న పార్లమెంటు ముందు ధర్నా నిర్వహించనున్నట్టు అఖిల భారత కిసాన్ కో ఆర్డినేషన్ కమిటీ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 'చలో ఢిల్లీ' కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని కమిటీ నాయకులు జస్టిస్ చంద్రకుమార్, వేములపల్లి వెంకట్రామయ్య, టి. సాగర్, అచ్చుతరామారావు, యాదగిరిరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యం కాదని చెప్పడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. రెతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి మద్ధతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40 శాతం రైతు ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. రైతుల అప్పులు మొత్తం రద్దు చేయాలని కోరారు. కార్పొరేట్ సంస్థలకు ఏటా రూ. 6లక్షల కోట్లు రాయితీ ఇస్తున్న ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. నవంబరు 20న రామ్ లీలామైదానం నుండి ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీలో, పార్లమెంటు ముందు జరిగే ధర్నాలో రైతులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పి. జంగారెడ్డి, కోటేశ్వరరావు, సాయన్న, ముడుపు నర్సన్న తదితరులు పాల్గొన్నారు.