Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారి గదిలోనే బంధువులతో ములాఖాత్
- శాఖను కుదిపేసిన సోషల్ మీడియా వీడియో
- జైలు సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్
- డీఐజీ నేతృత్వంలో విచారణ.. సీసీ ఫుటేజీ పరిశీలన?
నవతెలంగాణ-కరీంనగర్ టౌన్
అక్రమ ఫైనాన్స్ దందాలతో ఆర్థిక నేరాలకు పాల్పడిన ఏఎఎస్ఐ మోహన్రెడ్డికి కరీంనగర్ జిల్లా కారాగారంలో రాచమర్యాదలు అందుతున్నట్టు సోషల్మీడియాలో వీడియో హల్చల్ చేస్తోంది. సిబ్బందిలోని ఒకరు ముడుపులందుకొని ఆయనకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాచమర్యాదలపై ఓ వీడీయో చక్కర్లు కొడుతుండటం సంచలనం రేపుతోంది. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సిబ్బందిపై సీరియస్ అయినట్టు తెలిసింది. వడ్డీ వ్యాపారంలో 300 మందిని నిండా ముంచిన ఏఎస్ఐ మోహన్రెడ్డి ఏడు నెలల కిందట జైలుపాలైన విషయం తెలిసిందే. ఏసీబీ కేసులో ఆయన ఆస్తులను కోర్టు అటాచ్ చేసింది. ఈనెల 2వ తేదీన దీనికి సంబంధించిన ఆదేశాలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూడటం సర్వత్రా చర్చనీయాంశమౌతోంది. జైలు అధికారి గదిలోనే మోహన్రెడ్డి భార్య, బంధువులతో ములాఖాత్ అయినట్టు కనబడు తోంది. అయితే, వీడియో విషయం పైఅధికారుల దృష్టికి చేరడంతో సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ ఘటనపై డీజీ వీకే సింగ్ సైతం సీరియస్గా తీసుకుని విచారణ చేయిస్తున్న ట్టు తెలిసింది. ఏసీబీకి పట్టుబడిన మరో ఉద్యోగికీ జిల్లా కారాగారంలో మర్యాదలు లభిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అవినీతిరహిత శాఖగా ఇటీవల డీజీ వీకే సింగ్ ప్రకటించిన క్రమంలో ఈ బాగోతం బట్టబయలవడం గమనార్హం. అయితే మోహన్రెడ్డి బినామీలు కొందరు ఆస్తులను బాధితులకు తిరిగి చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గత ఆగస్టులో పుల్గం మల్లేశం అనే బినామీ తన పేరున ఉన్న ఆస్తులను బాధితుడు రాజిరెడ్డికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలలో మరో ఇద్దరి ఆస్తులు బదిలీ చేయాల్సి ఉంది. అందుకే మోహన్రెడ్డి బంధువులు, సన్నిహితులతో చర్చించినట్టు తెలుస్తోంది. దీనిపై జైలు సూపరింటెండెంట్ శివకుమార్గౌడ్ స్పందిస్తూ.. అతని భార్య అనారోగ్య కారణాల వల్ల కూర్చోబెట్టి ములాఖత్ కల్పించినట్టు తెలిపారు. మోహన్రెడ్డి సాధారణ జైలు జీవితమే గడుపుతున్నారని, ఎలాంటి మర్యాదలు కల్పించలేదని చెప్పారు.
డీఐజీ విచారణ ప్రారంభం..!
వీడియో విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో డీఐజీ సైదయ్య నేతృత్వంలో విచారణకు ఐజీ నరసింహా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
ఇప్పటికే పలువురు అధికారులను విచారించి ఎవరెవరు అక్కడికి వచ్చారో వివరాలు సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని, సిబ్బంది అవినీతికి పాల్పడితే చట్టరీత్యా శిక్షిస్తామని అధికారులు తెలిపారు. కాగా, ఈ వీడియో చూసి మోహన్రెడ్డి బాధితులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.